- Home
- Andhra Pradesh
- Andhra Pradesh: కుంకీ ఏనుగులుంటే మనుషులపై దాడులు ఆగిపోతాయా.? వీటి ప్రత్యేకత ఏంటి..
Andhra Pradesh: కుంకీ ఏనుగులుంటే మనుషులపై దాడులు ఆగిపోతాయా.? వీటి ప్రత్యేకత ఏంటి..
అన్నమయ్య జిల్లాలో మంగళవారం ఏనుగుల బీభత్సవం ఎంతటి విషాదాన్ని నింపిందో తెలిసిందే. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శేషాచలం అడవుల గుండా తలకోనకు నడిచి వెళ్తున్న భక్తులపై ఏనుగుల దాడిలో 5గురు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే కుంకీ ఏనుగుల ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఏనుగులు ఉండుంటే ప్రాణ నష్టం జరిగేది కాదని అంటున్నారు. ఇంతకీ ఏంటీ కుంకీ ఏనుగులు.? వీటి ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
kumki elephants
దాడి ఎక్కడ జరిగింది.?
ఓబులవారి పల్లె మండలం గుండాలకోన అటవీ ప్రాంతంలో భక్తులపై ఏనుగులు దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శేషాచలం అడవుల గుండా తలకోనకు నడిచి వెళ్తున్న సమయంలో అటుగా వచ్చిన ఏనుగుల గుంపు భక్తులపైకి దాడికి దిగాయి. ఒక్కసారిగా ఏనుగులు భక్తులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా భయంతో కేకలు పెట్టారు. భక్తులు పరుగులు పెట్టినా ఏనుగులు వెంటపడి మరీ దాడి చేశాయి.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కిరకీ రూ. 10 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. అటవీశాఖ అధికారులు భక్తులను రిజర్వ్ అటవీ ప్రాంతాల ద్వారా ప్రయాణించవద్దని హెచ్చరించినా వచ్చినట్లు చెబుతున్నారు. భక్తులు అధికారిక మార్గాల ద్వారా మాత్రమే వెళ్లాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.
స్పందించిన పవన్ కళ్యాణ్.
అన్నమయ్య జిల్లాలో జరిగిన ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అటవీ శాఖ అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను సందర్శించేందుకు వెళ్తున్న భక్తుల భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
wild elephant
తెరపైకి కుంకీ ఏనుగుల అంశం.
రాష్ట్రంలో ఏనుగుల బారి నుంచి మనుషుల్ని, పంటల్ని రక్షించేందుకు కర్ణాటక ప్రభుత్వం వాడుతున్న కుంకీ ఏనుగులను ఉపయోగించాలని గతంలో పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగానే కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నారు. గతేడాది ఆగస్టు 8వ తేదీన స్వయంగా బెంగళూరు వెళ్లి కుంకీ ఏనుగుల కోసం సీఎం సిద్ధరామయ్యతో చర్చించారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 27న విజయవాడలో ఒప్పందం చేసుకున్నారు.
కర్ణాటకలో శిక్షణ పొందిన ఏనుగులతో ఏపీకి చెందిన అటవీ సిబ్బంది శిక్షణ కూడా ఇప్పిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇంత వరకు కుంకీ ఏనుగులు రాష్ట్రానికి రాలేవు. కాగా అటవీ శాఖ నియమనిబంధనలు ఏనుగుల తరలింపుకు అడ్డంకిగా మారడం వల్లే ఆలస్యమైందని తెలుస్తోంది. వన్య ప్రాణుల తరలింపు, వాటి సంరక్షణ విషయంలో ఉన్న నిబంధనలతో ఏపీకి కుంకీ ఏనుగుల తరలింపు ఆలస్యమైనట్టు సమాచారం. తాజాగా జరిగిన ఏనుగుల దాడులతో మరోసారి కుంకీ ఏనుగుల అంశం తెరపైకి వచ్చింది.
అసలేంటీ కుంకీ ఏనుగులు, వీటి ఉపయోగం ఏంటి.?
కుంకీ ఏనుగులు అంటే ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏనుగులు. అటవి ఏనుగులను అదుపులో పెట్టేందుకు వీటిని ఉపయోగిస్తారు. పంట పొలాలపై, మనుషులపై దాడి చేసే ఏనుగులను కంట్రోల్ చేస్తాయి. అటవీ పరిరక్షణ పనుల్లో సహాయపడుతాయి. అడవుల్లో గ్రామాలకు హాని చేసే ఏనుగులను కుంకీ ఏనుగుల సహాయంతో పట్టుకొని, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. అడవీ మార్గాలను పరిశీలించడానికి, కొత్త మార్గాలను సిద్ధం చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. పండుగలు, దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు, ప్రభుత్వ ఉత్సవాల్లో భాగంగా వీటిని ఉపయోగిస్తారు. కొండప్రాంతాల్లో భారీ బరువులను మోసేందుకు ఈ ఏనుగులను ఉపయోగిస్తారు.
ఈ ఏనుగులకు శిక్షణ ఎలా ఇస్తారు.?
ఏనుగులు చిన్న వయసులోనే ఉన్నప్పుడే మానవులు వాటిని మచ్చిక చేసుకుంటారు. అనుభవజ్ఞులైన ఏనుగుల కాపరులు వీటికి శిక్షణ ఇస్తారు. మనుషుల ఆదేశాలను అనుసరించేలా ఏనుగులకు కఠినమైన శిక్షణ అందిస్తారు. భారత్లో ఈ కుంకీలు ఎక్కువగా అసోం, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. అసోంలోని కాజీరంగా నేషనల్ పార్క్లో ఈ ఏనుగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.
ఏనుగు చెవిని కాలితో తడితే.. ఏనుగు ముందుకు వెళ్తుంది. చెవి వెనక భాగంలో కాలి తొడతతో గట్టిగా తడితే అప్పుడు వెనుకకు వెళ్తాయి. చెవి మధ్యభాగంలో అదిమితే ఏనుగు ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇలా మావటి ఇచ్చే సిగ్నళ్లకు అనుగుణంగా కుంకీలు ప్రవరిస్తాయి. ఇతర ఏనుగులను తరిమికొట్టే క్రమంలో ఇవి గట్టిగా అరుస్తాయి. ఇలా చేయడానికి మావటిలు వాటికి ఒక సంకేతాన్ని ఇస్తారు. ఇలా ఇతర ఏనుగుల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గిస్తారు.