హత్య జరిగినట్లు తెలీకుండానే ఆరు మర్డర్లు..: దండుపాళ్యం గ్యాంగ్ నేరాలపై సిపి బత్తిన
అత్యంత క్రూరమైన దండుపాళ్యం ముఠా అరెస్ట్ కు సంబంధించిన వివరాలను విజయవాడ సిపి బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు.
విజయవాడ: అత్యంత కిరాతకంగా మనుషుల ప్రాణాలు తీస్తున్న కరుడుగట్టిన దండుపాళ్యం ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆరుగురిని హతమార్చిన ముఠా మరో పదిమందిని చంపడానికి రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. ఇంతటి క్రూరమైన ముఠాకు సంబంధించిన వివరాలను విజయవాడ సిపి బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు.
సీసీఎస్, పెనమలూరు పోలీసులు ఐదుగురితో కూడిన దండుపాళ్యం గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నట్లు సిపి తెలిపారు. నిందితులు పగలంతా ఆటో డ్రైవర్లు, పెయింటర్లు, కూరగాయల వ్యాపారులుగా పని చేస్తూ రెక్కీ నిర్వహించి... రాత్రి సమయంలో నేరాలకు పాల్పడతారని తెలిపారు.
ఈ దుండగుల ముఠా పోరంకి, పెనమలూరులో నివాసం ఉంటారని సిపి తెలిపారు. సుంకర గోపీరాజు, ప్రభుకుమార్ కలిసి ఈ నేరాలకు ప్లాన్ చేశారని... మొదటి నేరం పెనమలూరులో చేశారన్నారు. కరోనా కాలం కావడంతో వీరు హత్య చేసిన వారిని త్వరగా అంత్యక్రియలు చేశారని ఆయన చెప్పారు.
కంచికచెర్లలో ఇద్దరు వృద్ధ దంపతులను కూడా అతి కిరాతకకంగా హత్య చేశారన్నారు. ఇప్పటి దాకా ఐదు కేసుల్లో ఆరుగురిని హత్య చేసినట్లు సిపి తెలిపారు.
జూన్ 12న పెనమలూరులో ఏటీఎం బ్రేక్ చేసే యత్నం జరిగిందని... సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పరిశోధన చేసి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. అయితే కంచికచర్ల మర్డర్ కేసు వేలిముద్రలు, ఏటీఎం నేరం వేలిముద్రలు ఒకటే కావడంతో వీరి నేరాల చిట్టా మొత్తం బయటపడిందన్నారు.
ఈ ముఠా చేసిన నేరాలలో హత్య జరిగినట్టు బాధిత కుటుంబానికే తెలీకపోవడం గమనార్హమని సిపి చెప్పుకొచ్చారు. ఇంటికి రెండు వైపులా తలుపులు ఉండే ఇళ్ళనే ఈ ముఠా టార్గెట్ చేసినట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.