- Home
- Andhra Pradesh
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. అందుబాటులోకి రూ. 300ల దర్శన టికెట్లు, ఎలా బుక్ చేసుకోవాలంటే
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. అందుబాటులోకి రూ. 300ల దర్శన టికెట్లు, ఎలా బుక్ చేసుకోవాలంటే
శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మే నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. టీటీడీ అధికారిక వెబ్సైట్లో టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులు టీటీడీ వెబ్సైట్లోకి వెళ్లి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను ఫిబ్రవరి 22వ తేదీన విడుదల చేశారు. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను కూడా టీటీడీ ఇప్పటికే విడుదల చేసింది.
రూ. 300 టికెట్స్ ఎలా బుక్ చేసకోవాలంటే..
* ముందుగా టీటీడీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
* అనంతరం హోమ్ పేజీలో కనిపించే ఆన్లైన్ బుకింగ్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి.
* ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే నేరుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
* అకౌంట్ ఉన్న వారు నేరుగా ఇమెయిల్ ఐడీ, పాస్వర్డ్ సహాయంతో లాగిన్ కావాలి.
* తర్వాత ఈ ఎంట్రీ దర్శన్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి.
* అనంతరం ఎన్ని టికెట్లు కావాలి. దర్శనానికి వెళ్తున్న వారి వివరాలు ఎంటర్ చేయాలి. అలాగే అదనపు లడ్డూలు కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.
* ఆ తర్వాత డేట్ను సెలక్ట్ చేసుకొని, టైమ్ స్లాట్ను సెలక్ట్ చేసుకొని చివరిగా పేమెంట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
* క్రెడిట్, డెబిట్ కార్డు లేదా వెబ్సైట్ ద్వారా పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. టికెట్లు బుక్ కాగానే పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.
గదుల కోటా కూడా ఈరోజే..
ఇదిలా ఉంటే తిరుమలలో గదుల కోటాను కూడా సోమవారం విడుదల చేయనున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు ఈ కోటాను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు ఈ టికెట్లను కూడా టీటీడీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి రూమ్స్ బుకింగ్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. పరీక్షల సమయం కావడంతో భక్తులు త్వరగా దర్శనం చేసుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. ఆదివారం 78892 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోగా, 25930 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం హుండీ ఆదాయం రూ. 3.55 కోట్లు నమోదైంది.