మూడు రాజధానులు: చంద్రబాబును చిక్కుల్లో పడేసిన పవన్ కల్యాణ్
రాజధాని విషయంలో జగన్, చంద్రబాబు ఇరువురిపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ విమర్శించారు.
అమరావతి రైతుల సమస్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని చిక్కుల్లో పడేసినట్లే కనిపిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి అమరావతి రైతులకు మద్దతు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఇది చంద్రబాబును చిక్కుల్లో పడేసేదే అని అంటున్నారు.
తాము మూడు రాజధానులను బలపరుస్తున్నాం కాబట్టి తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు వాదించే అవకాశం ఉంది. మూడు రాజధానుల విషయంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని, తిరిగి పోటీ చేసి గెలిస్తే అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా అంగీకరిస్తామని, లేదంటే చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని మంత్రి కొడాలి నాని, వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు.
అయితే, తన ఎమ్మెల్యేల చేత చంద్రబాబు రాజీనామా చేయించే సాహసం చేయరనేది స్పష్టం. రాజీనామా చేయాలని అడిగినా వారిలో చాలా మంది చంద్రబాబు మాట వినకపోవచ్చు. ఇప్పటికే, వల్లభనేని వంశీ, కరణం బలరాం వైసీపీ వైపు వెళ్లిపోయారు. చంద్రబాబు ఆ సాహసం చేస్తే మరింత మంది ప్లేటు ఫిరాయించవచ్చు. దానివల్ల మొదటికే మోసం రావచ్చు.
ఇదిలావుంటే, పవన్ కల్యాణ్ తన ఏకైక ఎమ్మెల్యే చేత రాజీనామా చేయిస్తారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. రాపాక వరప్రసాద్ ఇప్పటికే పవన్ కల్యాణ్ మాట వినిడం లేదు. అందుకే, తన డిమాండ్ ను పవన్ కల్యాణ్ తెలివిగా గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేల రాజీనామాలకే పరిమితం చేసినట్లు గిట్టనివారు వ్యాఖ్యానిస్తారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే రాజీనామాల డిమాండుపై తన వైఖరిని వెల్లడించారు. శాసనసభను రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని ఆయన వైసీపీని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని విషయంలో మాట తప్పింది వైసీపీయే కాబట్టి ఆ పనిచేయాల్సింది ఆ పార్టీయేనని ఆయన అంటున్నారు.
జగన్, చంద్రబాబులు ఇరువురిని పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ కు పవన్ కల్యాణ్ ఎలాగూ ప్రత్యర్థి. అందువల్ల జగన్ ను పవన్ కల్యాణ్ డిమాండ్ ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. పైగా జగన్ అమరావతి రైతుల నిరసనను ఆహ్వానించడానికి జగన్ సిద్ధపడ్డారు. అమరావతి రైతుల తరపున పోరాటం చేయాల్సింది చంద్రబాబుమాత్రమే. అందువల్ల చంద్రబాబునే పవన్ కల్యాణ్ డిమాండ్ ఎక్కువ ఇబ్బందికి గురి చేస్తుంది.
ముగ్గురికి ముగ్గురు రాజీనామాల పర్వంలో డ్రామాలు ఆడుతున్నారు. జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు ఎవరికి వారు ఇతరుల మీద నిందలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తమదేమీ బాధ్యత లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే, జగన్ మాత్రం తన పని తాను చేసుకుని వెళ్లడానికే సిద్ధపడినట్లు స్పష్టమవుతోంది.