అమరావతి: జగన్, చంద్రబాబు మధ్య పోరుగా మార్చేసిన పవన్ కల్యాణ్
అమరావతి కోసం రాజీనామాలపై వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు.
జనసేన పవన్ కల్యాణ్ కు రాజకీయాల వల్ల ప్రస్తుతానికైతే వచ్చేది ఏమీ లేదు, పోయేది కూడా ఏమీ లేదు. కానీ, తక్షణ సమస్యలపై మాత్రం ఆయన మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడకపోతే ఆయనపై ప్రశ్నలు కురుస్తాయి. ఆ ప్రశ్నలు రాజకీయ పార్టీల నుంచి కన్నా ప్రజల నుంచి వస్తుంటాయి. దాంతో అనివార్యంగా ప్రతిస్పందించాల్సి వస్తుంది.
మూడు రాజధానుల వివాదం విషయంలో ఆయన అదే పనిచేశారు. తాను ఓ మాట అని మాటల సమరానికి తెర తీయడం తన రాజకీయ ఎత్తుగడగా పవన్ కల్యాణ్ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. మొదటి నుంచి కూడా అదే పని చేస్తున్నారు ఆయన. అయితే, చాలాసార్లు ఆయన వైసీపీ నాయకుల నుంచి తీవ్రమైన వ్యాఖ్యలు చవి చూశారు.
అమరావతి రైతుల కోసం గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వైసీపీ, టీడీపీ శాసనసభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసి నిప్పు రాజేశారు. ఇరు పార్టీల నాయకులు కూడా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. అయితే, ప్రధాన సమరం మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మధ్య పోరుగా మారింది. రాజీనామాల చుట్టూ రాజకీయాలు తిరిగేలా చేసిన పవన్ కల్యాణ్ దానికి కారణం.
రాజీనామాలపై వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. శాసనసభను రద్దు చేసి, తిరిగి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను డిమాండ్ చేశారు. జగన్ కు ఆయన 48 గంటల గడువు ఇచ్చారు. ఈ గడువు రేపు బుధవారం సాయంత్రంతో ముగుస్తుంది. ఆ తర్వాత చంద్రబాబు ఏం చేస్తారనే విషయంలో అందరికీ ఒక అంచనా అయితే ఉంది. అందుకు భిన్నంగా చంద్రబాబు వెళ్తే అది ఏపీ రాజకీయాల్లో అది సంచలనమే అవుతుంది.
జగన్ చంద్రబాబు సవాల్ ను స్వీకరిస్తారా అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడం సులభమే. జగన్ ఆ సవాల్ ను స్వీకరించబోరనే విషయం సామాన్యుడికి కూడా తెలుసు. అది చంద్రబాబుకు తెలియదని కాదు. తాను వెనక్కి తగ్గడం లేదనే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఆయన సవాల్ చేశారని అనుకోవచ్చు. ఏమైనా జగన్ వెనక్కి తగ్గుతారని మాత్రం అనుకోవడానికి లేదు.