సిఎం జగన్ ఝలక్: భంగపడిన ఎమ్మెల్యేలు వీరే...
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కచ్చితంగా స్థానం లభిస్తుందని భావించిన ముఖ్యమైన నేతలకు భంగపాటు తప్పలేదు. పార్టీ స్థాపించినప్పటి నుంచీ జగన్ వెంట ఉంటూ తెలుగుదేశం పార్టీని తమ మాటల ఈటెల ఎదుర్కున్న ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వైఎస్ జగన్ మంత్రివర్గ కూర్పు పక్కా సామాజికవర్గాల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని చేయడంతో వారికి నిరాశ ఎదురైంది.
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కచ్చితంగా స్థానం లభిస్తుందని భావించిన ముఖ్యమైన నేతలకు భంగపాటు తప్పలేదు. పార్టీ స్థాపించినప్పటి నుంచీ జగన్ వెంట ఉంటూ తెలుగుదేశం పార్టీని తమ మాటల ఈటెల ఎదుర్కున్న ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వైఎస్ జగన్ మంత్రివర్గ కూర్పు పక్కా సామాజికవర్గాల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని చేయడంతో వారికి నిరాశ ఎదురైంది.
మంత్రివర్గంలో రెడ్డి సామాజికవర్గానిదే ఆధిపత్యమనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా, ఆయా సామాజిక వర్గాలను సంతృప్తి పరిచే విధంగా వైఎస్ జగన్ మంత్రివర్గ సభ్యులను ఎంపిక చేసుకున్నారు. కాపులకు, ఎస్సీలకు, బీసీలకు మంత్రివర్గంలో పెద్ద పీట వేశారు. దాంతో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు బెర్తులు దక్కలేదు
మంత్రివర్గంలో స్థాన ఆశించి భంగపడినవారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫైర్ బ్రాండ్ రోజాను. ఆమె మొదటి నుంచీ జగన్ వెంట నడుస్తూ తెలుగుదేశం పార్టీ నేతలను ధీటుగా ఎదుర్కుంటూ వచ్చారు. రెండోసారి నగరి శాసనసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే, ఆమె రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఆమెను మంత్రివర్గంలో చేర్చుకోవడానికి సామాజిక సమీకరణాలు అడ్డువచ్చాయి.
మరో నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన కూడా మంత్రిపదవిని ఆశించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఈగ వాలినా ఒంటి కాలి మీద లేచిన నేత. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎప్పటికప్పుడు నిప్పులు చెరుగుతూ వచ్చారు. పలుమార్లు అరెస్టు కూడా అయ్యారు. అయితే, ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.
మరో నేత భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓ రకంగా మౌత్ పీస్ గా ఉంటూ వచ్చారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరిగా మెలుగుతూ వచ్చారు. ఆయనకు కూడా నిరాశే ఎదురైంది. తనకు మంత్రి పదవి దక్కడం లేదని ఒకింత అసహనానికి గురై మాట్లాడిన సందర్భం కూడా ఉంది.
సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని అందరూ ఊహించారు. కానీ ఆయనను జగన్ పక్కన పెట్టేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. అయితే, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు కూడా మంత్రి పదవి దక్కలేదు. ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం దండిగానే ఉంది
మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు కూడా ఉన్నారు. కాపులకు మంత్రివర్గంలో పెద్ద పీట వేసినప్పటికీ జగన్ అంబటి రాంబాబును మంత్రివర్గంలో చేర్చుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడంలో అంబటి రాంబాబు ధీటుగా వ్యవహరించారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు కూడా
కర్నూలు జిల్లా శిల్పా కుటుంబానికి కూడా మంత్రి పదవి దక్కలేదు. వారు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అయితే, కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కాదని మరొకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు. దాంతో శిల్పా కుటుంబ సభ్యులను పక్కన పెట్టాల్సి వచ్చింది.
పశ్చిమ గోదావరి జిల్లా తెల్లం బాలరాజు కచ్చితంగా మంత్రివర్గంలో ఉంటారనే ప్రచారం సాగింది. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది.
కడప జిల్లా రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి కూడా మంత్రివర్గంలో ఉంటారని అందరూ భావించారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడమే కాకుండా టీడీపీని ధీటుగా ఎదుర్కున్న నాయకుల్లో ఒక్కరు. కడప జిల్లా నుంచి మైనారిటీకి చెందిన ఆంజాద్ బాషాకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.
కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు కూడా మంత్రి పదవిని ఆశించారు. ఆయనకు జగన్ నుంచి ఫోన్ వచ్చిందని, మంత్రి పదవి ఖాయమని ఒకానొక సందర్భంలో ఆయన అభిమానులు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే, చివరి నిమిషంలో ఆయనకు పదవి దక్కకుండా పోయింది
తెలుగుదేశం పార్టీ అధినేత తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ను మంగళగిరిలో ఓడించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి ఖాయమని భావించారు. పైగా, ఆళ్ల మంత్రి అవుతారని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారు కూడా. అయితే, ఆయనకు కూడా నిరాశ తప్పలేదు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట టికెట్ ఆశించి భంగపడిన మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. విడుదల రజనీకి టికెట్ కేటాయిస్తూ జగన్ మర్రి రాజశేఖర్ కు ఆ హామీ ఇచ్చారు. కానీ, మర్రి రాజశేఖర్ కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు