- Home
- Andhra Pradesh
- Temple Economy : ఏంటీ..! తెలుగు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే దేవాలయాల ఆదాయమే ఎక్కువా!!
Temple Economy : ఏంటీ..! తెలుగు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే దేవాలయాల ఆదాయమే ఎక్కువా!!
దేవాలయాల ఆర్థిక వ్యవస్థ : భారతదేశంలో దేవాలయాల వల్ల జనరేట్ అయ్యే ఆదాయం ఎన్ని లక్షల కోట్లో తెలుసా? ఇరు తెలుగు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ ను కలిపినా ఈ టెంపుల్ ఎకానమీయే ఎక్కువగా ఉంటుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Temple Economy
ITCX 2025 : ఓ దేశం అభివృద్ది చెందాలంటే అన్నిరంగాల పరితీరు మెరుగ్గా ఉండాలి. అప్పుడే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా మారి అభివృద్ది, ప్రజా సంక్షేమానికి వీలుంటుంది. ముఖ్యంగా ఏ దేశ అభివృద్దిలో అయినా వ్యాపార, వాణిజ్య రంగాలు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే భారతదేశ అభివృద్దిలో ఈ రంగాలతో పాటు ప్రత్యేకంగా మరో రంగం కీలక పాత్ర పోషిస్తోంది... అదే ఆద్యాత్మిక రంగం.
భారత్ ప్రాచీన దేవాలయాలకు పుట్టినిల్లు... ఇక్కడ వేల ఏళ్ళనుండి పూజలందుకుంటున్న దేవుళ్లు ఉన్నారు. శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, వైష్ణవ ఆలయాలు... ఇలా లక్షలాది చిన్నాపెద్ద ఆలయాలున్నాయి... వీటినుండి ఏటా లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. దీన్నే టెంపుల్ ఎకానమీ (ఆలయ ఆర్థికవ్యవస్థ) గా పేర్కొంటారు. దేశ అభివృద్దిలో ఈ ఎకానమీ కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి పట్టణంలో అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ ఆండ్ ఎక్స్ పో (ITCX 2025) జరుగుతోంది. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మహారాష్ట్ర, గోవా సీఎంలు దేవేంద్ర పడ్నవిస్, ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెంపుల్ ఎకానమీ గురించి ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వివరాలను వెల్లడించారు.
Temple Economy
భారతదేశంలో టెంపుల్ ఎకానమీ ఎంతో తెలుసా?
ఆద్యాత్మికత రంగం కేవలం దైవభక్తికే పరిమితం కాలేదు... దేశ ఆర్థిక వ్యవస్థలోనూ భాగమై అభివృద్దికి బాటలు వేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారతదేశంలో కేవలం ఆలయ ఆర్థికవ్యవస్థ రూ.6 లక్షల కోట్లు ఉంటుందని తెలిపారు. అంటే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ బడ్జెట్ కలిపినా ఈ టెంపుల్ ఎకానమీ ఎక్కువగా ఉంటుందన్నమాట.
దేశంలో మరే ఆర్థిక కార్యకలాపాలకు తీసిపోకుండా టెంపుల్ ఎకానమీ ఉందని చంద్రబాబు అన్నారు. దేవాలయాలు, ఆ చుట్టుపక్కల చాలా ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయని ... ఇది 365 రోజులు జరిగే ప్రక్రియ అని అన్నారు. అంటే ఏడాదిపొడవునా విరామం అన్నదే లేకుండా ఆలయాల ఆర్థిక వ్యవస్థ సాగుతుంది... ఇందులో మనందరం భాగస్వాములమేనని చంద్రబాబు తెలిపారు.
దేవాలయాలకు భక్తులు విరాళాలు కూడా అందిస్తుంటారు... వాటిని ఎందుకోసమైతే ఇచ్చారో వాటికే ఖర్చుచేయాలని చంద్రబాబు అన్నారు. భక్తుల విరాళాల ఖర్చు విషయంలో పారదర్శకత ఉండాలని... అప్పుడే మరింతమంది విరాళాలు ఇచ్చి ఆలయ ఆర్థికవ్యవస్థలో పాల్గొంటారని అన్నారు. నిరుపేదల శ్రేయస్సు, దేవాలయాల అభివృద్ది, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు దాతల విరాళాలను ఉపయోగించుకుంటున్నామని చంద్రబాబు స్పష్టం చేసారు.
Chandrababu Naidu
దేవుడు గొప్పా... టెక్నాలజీ గొప్పా? : టెక్ సీఎం చంద్రబాబు ఏమన్నారు....
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని దేవాలయాల నిర్వహణకు ఉపయోగించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. అయితే ఈ టెక్నాలజీ అనేది భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించేలా ఉండకూడదన్నారు. కాబట్టి ఎంతవరకు అయితే టెక్నాలజీ అవసరమే అంతమేరకే ఉపయోగించాలని సూచించారు.
'టెక్నాలజీ, దేవుడు వేరువేరు... ఆ దేవుడిని ఈ టెక్నాలజీ ఎప్పటికీ మించలేదు. మనమంతా నిమిత్తమాత్రులం... దేవుడిపై ఆదారపడాల్సిన వారిమే. ఆ దేవుడిని మించిన టెక్నాలజీ ఏం ఉండదు. అలాగని ఆలయాల్లో టెక్నాలజీని ఉపయోగించకూడదని చెప్పడంలేదు. అవసరమైన చోట తప్పకుండా వాడాలి...కానీ భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా వాడకూడదు' అని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రస్తుతం భారతదేశం వేగంగా అభివృద్ది చెందుతోంది... సరైన సమయంలో సరైన నాయకులు దేశాన్ని పాలిస్తున్నాడు అంటే ప్రధాని మోదీని చంద్రబాబు ప్రశంసించారు. టెంపుల్ ఎకానమీతో పాటు అన్ని ఆర్థిక వ్యవస్థలు మెరుగ్గా ఉన్నాయి... కాబట్టి 2029 నాటికి భారత్ ప్రపంచలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఇక 2047 నాటికి ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ టాప్ లో ఉంటుందని చంద్రబాబు అన్నారు.