రాజ్ భవన్ కు రాజమ్మ: మానవత్వాన్ని చాటుకున్న మనసున్న గవర్నర్
వృద్దురాలు బండిపల్లి రాజమ్మ పరిస్థితి గురించి తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చలించిపోయారు.
హైదరాబాద్: వయసు మీదపడటంతో శరీరం సహకరించడం లేదు. ఇలాంటి సమయంలో అయినవారందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలింది ఓ వృద్దురాలు. అంతేకాదు ఆమెకు నిలువనీడ కూడా లేదు. ఇలా కూడు, గూడు లేకుండా తీవ్ర అవస్థలు పడుతున్న ఈ వృద్దురాలు ఇప్పుడు రాజ్ భవన్ కు చేరుకున్నారు.
వృద్దురాలు బండిపల్లి రాజమ్మ పరిస్థితి గురించి తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చలించిపోయారు. దీంతో వెంటనే ఈ 75ఏళ్ల ఒంటరి మహిళను రాజ్ భవన్ కు పిలిపించుకుని సాయం చేశారు.
నిరాశ్రయురాలయి రాజమ్మకు రూ.50వేల ఆర్థిక సాయంతో పాటు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు గవర్నర్. అంతేకాకుండా ఆమెకు ఇకపై కూడా ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తానని గవర్నర్ తమిళిసై హామీ ఇచ్చారు.
రాజమ్మకు కూతురు ఇటీవలే పాముకాటుతో మరణించింది. కోడలు కూడా చాలారోజులుగా అనారోగ్యానికి గురయి ఇటీవలే మరణించింది. ఇలా అయినవారిని కోల్పోయి రాజవ్వ ఒంటరిగా మారింది.
ఇలా కష్టాల్లో వున్న వృద్దురాలకి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు గవర్నర్. మానవసేవే మాధవసేవగా బావించి వృద్దురాలికి తనవంతు సాయం చేసినట్లు తమిళిసై తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా పేదలకు, నిరాశ్రయులకు సాయపడాలని గవర్నర్ తమిళిసై సూచించారు.