డాక్టర్ గా పల్నాటి ముద్దుబిడ్డ...మరి రాజకీయాల్లో..: కోడెలకు చంద్రబాబు నివాళి
36ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీతో ఉండి ప్రజల కష్టనష్టాలలో దివంగత కోడెల శివప్రసాదరావు అండగా నిలిచారని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు.
అమరావతి: మాజీ మంత్రి, నవ్యాంధ్ర అసెంబ్లీ మొదటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు టీడీపీ జాతీయ అధ్యక్షులు, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. ఈ క్రమంలో కోడెల ప్రజా, రాజకీయ జీవితం ఎలా సాగిందో... ఆయనతో తనకు ఎలాంటి అనుబంధం వుండేదో చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
''డాక్టరుగా పలనాటి ముద్దుబిడ్డ అయ్యారు. రాజకీయ నేతగా పల్నాటి పులి అనిపించుకున్నారు. 36ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీతో ఉండి ప్రజల కష్టనష్టాలలో అండగా నిలిచిన నేత కోడెల శివప్రసాదరావు. అటువంటి నేత ఈరోజు మనమధ్య లేకపోవడం రాష్ట్ర రాజకీయాలకే తీరనిలోటు'' అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
''కోడెల ప్రజాసేవ గురించి కోటప్పకొండ ఆలయం చెబుతుంది. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కన్వీనర్గా నరసరావుపేట, సత్తెనపల్లిలో రికార్డుస్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమాలు ఆయన పట్టుదలకు నిదర్శనం. అవయవదాన కార్యక్రమాన్ని సామూహిక కార్యక్రమం చేసిన ఘనత కోడెలది. ఏపీ శాసనసభ తొలి సభాపతిగా ఆయన నిర్వహించిన పాత్ర ఆదర్శనీయం'' అని కొనియాడారు.
''రాజకీయ కక్షసాధింపులతో కోడెలను బలితీసుకొని, ఇప్పుడు ఆయన ప్రథమ వర్ధంతి కార్యక్రమాలను కూడా అడ్డుకోవాలనుకోవడం ప్రభుత్వ దుర్మార్గం. ఎన్నిచేసినా ప్రజల మనస్సులో కోడెల జ్ఞాపకాలను చెరిపేయలేరు'' అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇక కోడెల వర్ధంతిని పురస్కరించుకుని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా నివాళి అర్పించారు.''డాక్టరుగా పేదలకు సేవచేయడంతో పాటు, పల్నాటి రౌడీ రాజకీయాలకు చికిత్సచేసి శాంతిని, అభివృద్ధిని అందించి, ఆరోగ్యకర సమాజానికి బాటలు వేసిన పొలిటికల్ డాక్టర్ కీర్తిశేషులు కోడెల శివప్రసాదరావుగారు. అవినీతిపరుల కక్షలు, కుట్రల కారణంగా ఆయన మనకు దూరమై ఏడాది గడిచింది'' అంటూ లోకేష్ గుర్తుచేశారు.
''మూడున్నర దశాబ్దాల రాజకీయజీవితంలో ఎన్టీఆర్, చంద్రబాబుగార్ల మంత్రి వర్గాల్లో పనిచేసి మచ్చలేని నాయకుడిగా పేరుపొందారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతిగా తన వ్యక్తిత్వంతో ఆ పదవికే వన్నె తెచ్చారు. కోడెలగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు'' అని లోకేష్ ట్వీట్ చేశారు.
అలాగే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కూడా లో కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కోడెలకు పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, తెలుగురైతు అధ్యక్షులు మార్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.