స్కూల్ బ్యాగ్ మోసిన జగన్: పిల్లల స్పందనలు ఇవీ... (ఫొటోలు)
ఏపీ ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న విద్యాకానుక’ పథకాన్నికృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు, విద్యార్ధుల తల్లిదండ్రులు జగన్ ప్రవేశపెట్టిన పథకాలను గురించి మాట్లాడారు.
షేక్ తస్లీం, నాలుగో తరగతి విద్యార్ధి మాట్లాడుతూ.. మన జగన్ మామయ్య ముఖ్యమంత్రి అయ్యాక, విద్యకు సంబంధించి చాలా పథకాలు ప్రవేశపెట్టారు. వాటిలో భాగంగా అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, నాడు–నేడు మరి ఈ రోజు జగనన్న విద్యా కానుక.
నాకొక కోరిక ఉంది జగన్ మామయ్య అది ఏంటంటే, నేను బాగా చదువుకుని పెద్దయ్యాక కలెక్టర్ కావాలని, కలెక్టర్ అయి మీరు పెట్టిన ఈ పథకాలన్నీ పేద ప్రజలకు అందేలా చూడాలని నా కోరిక. అప్పటి దాకా మీరు సీఎంగా ఉంటారా మామయ్యా? ఉండాలి, ఉండి తీరాలి. మరి నా ఆశ తీరాలంటే మామయ్య మా అమ్మా, నాన్నల దగ్గర అంత స్ధోమత లేదు.
కాన్వెంటు పిల్లలను చూసి వాళ్లలాగా బూటూ, సూటూ వేసుకుని వెల్లాలని ఉంటుంది. ఆ కోరిక నాకు ఈ జగనన్న విద్యా కానుక ద్వారా తీరబోతుంది. మా నాన్న చెప్పారు, జగనన్న విద్యా కానుక ద్వారా అందించిన స్కూలు బ్యాగు, మూడు జతల యూనిఫాం, షూ, బెల్టు, టెక్ట్స్ బుక్స్, వర్క్బుక్స్ ఇవన్నీ కొనాలంటే రూ.3500 అవుతాయని చెప్పారు.
మాకు ఆ బాధే లేదు, ఎందుకంటే మా జగన్ మామయ్య కొనిచ్చారు. అంతేకాదు నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాలకు రూపురేఖలు మార్చేశాడు మా మామయ్య. మన మామయ్య మన పాఠశాలకు వస్తారని మనం అనుకున్నామా ? నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. మధ్యాహ్న భోజనంలో అయితే మన సీఎం మామయ్య మంచి పౌష్టిహారం అందించారు. అంత చక్కటి భోజనం చేసి పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు.
మనకేం కావాలో, ఏమిస్తే మనం సంతోషంగా ఉంటామో, ఏమిస్తే మనలాంటి పేదలు గొప్పవాళ్లమవుతామో ఆయనకు తెలుసు, ఇంతకంటే గొప్ప మామయ్య మనకు దొరుకుతాడా? అందుకే నేను అంటాను మన జగన్ మామయ్య అంటే నాకు ఎంతో ఇష్టం, మామయ్య నువ్వు ఇచ్చిన ఈ వనరులు ఉపయోగించుకుని తప్పనిసరిగా కలెక్టర్ అవుతాను.
కలెక్టర్ అయ్యి తాతయ్య వైయస్.రాజశేఖర్ రెడ్డి గారి కోరిక తీరుస్తాను. పేదలకు సహాయం చేస్తాను. మనకేం కావాలో, ఏమిస్తే మనం సంతోషంగా ఉంటామో ఆయనకు తెలుసు, అందుకే నేనంటాను జై జగన్ మామయ్య, జై జై జగన్ మామయ్య. ఈ అవకాశాన్నిచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.
లీలా లహరి అనే ఐదో తరగతి మాట్లాడుతూ.. సార్, నేను 3వ తరగతివరకు ప్రైవేటు స్కూల్లో చదివాను. నా తల్లిదండ్రులు ఆర్ధిక పరిస్ధితి సరిగా లేకపోవడం వల్ల నేను గతేడాది మండల పరిషత్ స్కూల్లో నాలుగో తరగతిలో చేరాను. గతేడాది మా అమ్మ జగనన్న అమ్మఒడి కింద రూ.15వేలు అందుకుంది.
నిజంగా ఈ డబ్బులు మా తల్లిదండ్రులకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఇది నా విద్యా జీవితంలో చాలా మంచి మార్పు. ఈ సంవత్సరం మరో మంచి మార్పు నా విద్యా జీవితంలో రాబోతుంది. అదే జగనన్న విద్యాకానుక, అది జగన్ మామయ్య నాకిచ్చిన బహుమతి అని చెప్పగలను.
జగగన్న విద్యాకానుకలో స్కూలు టెక్ట్స్ బుక్స్, వర్క్బుక్స్, మూడు జతల యూనిఫాం, షూ, రెండు జతల సాక్స్ మరియూ బెల్ట్. జగనన్న విద్యాకానుక ఈ విద్యా సంవత్సరంలో మా తరగతులు ప్రారంభం కాకముందే ఇవ్వడంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది.
నేను మాటిస్తున్నాను, నేను కచ్చితంగా బాగా చదవుతాను. నా తరగతిలో మొదటి ర్యాంకు తెచ్చుకుంటాను. నా లక్ష్యాన్ని సాధిస్తాను, నా ఫ్రెండ్స్ను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరమని ఎంకరేజ్ చేస్తాను. తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఈ సౌకర్యాలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్ మామయ్యకు ధన్యవాదములు.
ఉషా కుమారి, పేరెంట్స్ కమిటీ మెంబర్ మాట్లాడుతూ.. ఈ రోజు జగనన్న విద్యాకానుక కింది షూ, రెండు జతల సాక్సులు, మూడు జతల బట్టలు, బ్యాగు, బెల్టు, పుస్తకాలు ఇవన్నీ కూడా పేద, మద్యతరగతి, నిరుపేద తల్లిదండ్రులకు ఈ కరోనా టైంలో చాలా, చాలా ఉపయోగకరంగా ఉంటాయని మా తల్లిదండ్రులు అందరి తరపున కూడా చాలా సంతోషిస్తున్నాను
ఇదే కాకుండా అమ్మఒడి పథకం కింద రూ.15వేలు ఇచ్చి ఆర్ధికంగా వాళ్లు ఎదిగేందుకు మాకు అందజేశారు. మరి నాడు–నేడు కార్యక్రమంలో స్కూళ్లు రిపేర్లకు కానీ, ఆడపిల్లలకు ప్రత్యేక బాత్రూంలు, స్కూళ్లో వాటర్ ట్యాంకులు , బోర్డులు, ఫ్యానులు అన్నీ సమకూర్చారు.
ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఈ గవర్నమెంటు స్కూళ్లను నిలబెట్టిన మా జగనన్నకు మా తల్లిదండ్రులందరి తరపున కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం.
అలాగే ఈ రోజు ఇంగ్లిషు మీడియం స్కూళ్లు గవర్నమెంటు స్కూళ్లకు ఎందుకుని ఎన్నో అవరోధాలు, అడ్డంకులు ఎన్నెన్నో వచ్చిన ప్పటికీ కూడా, మా పేద, మద్యతరగతి పిల్లలకు ఇంగ్లిషు మీడియం అందజేసినందుకు మీకు చాలా, చాలా ధన్యవాదములు అన్నా. ఇంగ్లిషు మీడియం కోసం పేద, మద్యతరగతి వాళ్లు ప్రైవేటు స్కూళ్లకు పంపలేరు.
మరి అలాంటి విద్యను మన గవర్నమెంటు స్కూళ్లకు అందించడమంటే ఆయన కార్యదీక్ష, పట్టుదల తెలుస్తుంది. జగనన్న మీరు ఈ ఇంగ్లిషు మీడియాన్ని ఇలాగే కొనసాగించండి. మీ వెనుక మేం తల్లిదండ్రులందరం ఉన్నామని స్వయంగా చెపుతున్నాం. మీరిలాగే ముందుకు వెళ్లాలి. నేటి బాలలే రేపటి పౌరులగా గుర్తించిన మా జగనన్నకు కోటి వందనాలు.
అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూలిపనులకెలుతుంటే పిల్లలు ఏం తింటారనే బెంగలేకుండా.. మధ్యాహ్న భోజన పథకంలో జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో మా పిల్లలకు వెజిటబుల్ బిర్యానీ, చిక్కీ, పొంగల్, గుడ్డు పెడుతూ, ఇలాంటి సదవకాశాన్ని ఇచ్చి వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నందుకు ధన్యవాదములు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి.
ఇకపై పిల్లలకు అక్షరాభాస్యం చేసేటప్పుడు ఏ దేవుడు పేరో రాయకుండా జగన్ మామయ్య, జగన్ మామయ్య అని రాసే రోజులు ఎంతో కాలం లేవని ఘంటాపధంగా మీ వెనుక మా తల్లిదండ్రులు, బాల,బాలికలు ఉన్నారని తెలియజేస్తూ ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
రేపు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవరకు ఆయన మనముందుండి నడిపించాలని కోరుకుంటూ, మా పిల్లలకి ఉద్యోగ పత్రాలిచ్చి, ఉద్యోగాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందన్నారు. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలన్నారు. చదువే విద్యార్థులకు ఒక శక్తి అని పేర్కొన్నారు. నవంబర్ 2 లోగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 44.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందిస్తామని జగన్ పేర్కొన్నారు. రూ.650 కోట్ల ఖర్చుతో విద్యాకానుకను అందిస్తున్నాం. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మూడ్రోజులపాటు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.