రోడ్డుపక్కనే కరోనా మృతదేహాలు... భయాందోళనలో కర్నూల్ ప్రజలు
కర్నూల్ జిల్లాలో రోడ్డు పక్కనే కరోనా మృతదేహాలు, రోగుల చికిత్స కోసం వాడిన వైద్య సామాగ్రి బహిరంగ ప్రదేశాల్లో పారేయడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
కర్నూల్: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి అతి వేగంగా విస్తరిస్తోంది. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్న వేళ ఏపిలో మాత్రం అంతకంతకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం మూడు జిల్లాల్లోనే (కర్నూలు 292, గుంటూరు 237, కృష్ణా 210 కేసులు) 739 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటేనే ఏపిలోని భయానక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నా ప్రభుత్వాధికారులు ఎప్పటి మాదిరిగానే నిర్లక్ష్య దోరణితో వ్యవహరిస్తున్నారు కర్నూల్ జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు కర్నూల్ లోనే నమోదవుతున్నా అధికారులు మాత్రం మొద్దునిద్రను వదల్లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
భయంకరమైన కరోనా వ్యాధితో బాధపడుతూ చనిపోయిన వారి మృతదేహాలను కర్నూల్ పట్టణ శివారులో రోడ్డుపక్కనే పూడ్చిపెట్టడం ప్రజల ఆందోళనకు కారణమయ్యింది. ఈ కరోనా మృతదేహాలపై జిల్లాలో భయాందోళనలు మొదలయ్యాయి.
కర్నూల్ శివారులోని జాతీయ రహదారి పక్కనే రాత్రికి రాత్రి కరోనా మృత దేహాలను పూడ్చిపెట్టారు. మృతదేహాలను పూడ్చిన మట్టి పైన బ్లీచింగ్ పౌడర్ చల్లి, పీపీఈ కిట్లను తగుల బెట్టకుండా రోడ్డు మీదనే పారేసి వెళ్లారు. ఇలా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం నాలుగు కరోన మృత దేహాలను తమ ఊరి దగ్గర పూడ్చారంటు కర్నూల్ శివారులోని మూడు గ్రామాల ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను కుక్కలు, నక్కలు ,పందులు ఇలా ఏవయిన జంతువులు తవ్వితే ఆ వైరస్ అన్ని గ్రామాలకు వ్యాపిస్తుందన్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను కాల్చకుండా మట్టిలో ఎందుకు పూడ్చుతున్నారని కర్నూల్ ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు.