మరణం తర్వాత సైతం కోడెలపై కక్ష సాధింపు?
టీడీపీ సీనియర్ నేత , అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విషయంలో మరోసారి జగన్ సర్కార్ కక్షసాధింపులకు పాల్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు
టీడీపీ సీనియర్ నేత , అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విషయంలో మరోసారి జగన్ సర్కార్ కక్షసాధింపులకు పాల్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు కోడెల కన్నుమూసి పక్షం రోజులు గడుస్తుండటంతో గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి సైతం తీసుకున్నారు టీడీపీ నేతలు. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సోమవారం ఉదయం అధికారులు, పోలీసులు కలిసి కోడెల విగ్రహానికి ఏర్పాటు చేసిన దిమ్మెను కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దీనిపై తెలుగుదేశం నేతలు అధికారులను నిలదీయగా... ఈ ప్రాంతంలో విగ్రహా ఏర్పాటుకు అనుమతి లేదని బదులిచ్చారు. అయితే తాము వారం క్రితమే విగ్రహ ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి కోరామని అయినా అధికారులు కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. బతికున్నప్పుడు కోడెలను కేసుల పేరుతో వేధించిన వైఎస్ జగన్ ఆయన మరణించాక కూడా కక్షసాధిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీలో తమ గొంతును నొక్కేశారని కనీసం నోరెత్తకుండా చేశారని కోడెలపై జగన్ విరుచుకుపడేవారు. మరోవైపు ఎన్నికలకు ముందు జగన్పై కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక దుర్మార్గుడు పార్టీ పెట్టి నీతి గురించి మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. తన అవినీతిపైనా, జగన్ అవినీతిపైనా బహిరంగ చర్చకు సిద్ధమని కోడెల అప్పట్లో సవాల్ విసిరారు. తాను ఎవరికి తలవంచకుండా నిప్పులా బతికానని విశ్వాసంతోనే పదవులు వచ్చాయని అంతేకాని ఏనాడు పదవుల కోసం ఆరాటపడలేదని వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకునే కోడెలను జగన్ టార్గెట్ చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే కే ట్యాక్స్, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, అసెంబ్లీ ఫర్నిచర్ వంటి కేసులు కోడెలతో పాటు ఆయన కుటుంబసభ్యులకు చుట్టుకున్నాయి. రోజుకొక కేసులో విచారణతో పాటు వైసీపీ సోషల్ మీడియాలో విషప్రచారం జరగడంపై శివప్రసాద్ బహిరంగంగానే విమర్శిం
ఆయా కేసులపై విచారణ జరుగుతుండగానే ఈ నెల 16న కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్లోని నివాసంలో ఫ్యాన్కు ఉరేసుకున్న కోడెల ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు.
రాజకీయ వేధింపుల కారణంగానే శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని, కుమారుడి ప్రవర్తన కారణంగా మానసిక వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డారని ఇలా పలురకాలుగా కథనాలు వెలువడ్డాయి. ఏదేమైనా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడి, పల్నాటి పులిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన అర్థాంతరంగా మరణించడం టీడీపీకి తీరనిలోటని విశ్లేషకుల మాట.