వెంటాడి మరీ... డాక్టర్ సుధాకర్ ని హతమార్చారు...: లోకేష్ సంచలనం
ఇటీవల హటాత్తుగా చనిపోయిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావడం లేదని... రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని....జగన్ రెడ్డి దళితులను, దళిత మేధావులను వెంటాడి, వేధించి చంపేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల హటాత్తుగా చనిపోయిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం జగన్ రెడ్డి ఓ శాడిస్ట్ అని మండిపడ్డారు. దళితులని వేధించి చంపి రాక్షస ఆనందం పొందే వాడిని శాడిస్ట్ అనే అంటారని మండిపడ్డారు.
జగన్ ను శాడిస్ట్ అని కోపంతో అనడం లేదని... రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిస్తే ఆయన సీఎం జగన్ రెడ్డో...శాడిస్ట్ జగన్ రెడ్డో తేలిపోతుందన్నారు. దళిత డాక్టర్ సుధాకర్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని లోకేష్ ఆరోపించారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన గొప్ప డాక్టర్ ని శాడిస్ట్ జగన్ రెడ్డి బలితీసుకున్నాడని మండిపడ్డారు.
డాక్టర్ సుధాకర్ కేవలం మాస్క్ ఇవ్వమని అడిగినందుకు ఈ శాడిస్ట్ ప్రభుత్వం కక్ష కట్టిందని...నడి రోడ్డుపై పడేసి చేతులు వెనక్కి విరిచి వేధించారని గుర్తుచేశారు. ఓ డాక్టర్ ను పిచ్చోడనే ముద్ర వేశారన్నారు. ఆసుపత్రి లో ఉన్న లోపాలు బయటపెట్టినందుకే స్థానిక ఎమ్మెల్యే తనని టార్గెట్ చేసారని డాక్టర్ సుధాకర్ చెప్పారన్నారు.
డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుని వివరిస్తూ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిందని గుర్తుచేశారు. ఆయన మానసిక స్థితి పై ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు నివేదికలపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసి సీబీఐ దర్యాప్తు కి ఆదేశించిందన్నారు. అయినా ఈ శాడిస్ట్ జగన్ రెడ్డి డాక్టర్ ని ప్రశాంతగా ఉండనివ్వలేదని... మంత్రులు నేరుగా బెదిరింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు ఒప్పుకుంటే ఉద్యోగం ఉంటుందని... లేకపోతే ఇబ్బందులు తప్పవు అని బెదిరించారని లోకేష్ పేర్కొన్నారు.
''జూన్ 6, 2020 న సీబీఐ కేసు రిజిస్టర్ చేసింది. సెప్టెంబర్ 2 ,2020 న డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందని సీబీఐ హైకోర్టుకి నివేదిక అందజేసింది. న్యాయం జరిగే లోపే ఆయన చనిపోవడం బాధాకరం. ఆఖరికి ఆయన చనిపోయిన తరువాత కూడా శాడిస్ట్ జగన్ రెడ్డి వదలలేదు'' అన్నారు.
''డాక్టర్ సుధాకర్ కుటుంబానికి టిడిపి అండగా ఉంటుంది. ప్రభుత్వం తక్షణమే ఆయన కుటుంబానికి న్యాయం చెయ్యాలి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే కాబట్టి కోటి రూపాయిలు ఆర్థిక సహాయం కుటుంబానికి ప్రభుత్వం అందజేయ్యాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.
''దళితులంటే జగన్ రెడ్డికి ఎంత చిన్న చూపో రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనల ద్వారా అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా దళితుల పై దాడులు ఆపాలి. అంబెద్కర్ రాజ్యాంగాన్ని అమలు చెయ్యాలి. మారకపోతే రాజారెడ్డి రాజ్యాంగాన్ని చెత్త బుట్టలో వేసి శాడిస్ట్ జగన్ రెడ్డికి ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు'' అని లోకేష్ హెచ్చరించారు.