గంటాకు అడ్డుపుల్లలు వేస్తున్న అవంతి: భిమిలీలో ఆందోళనలు
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం విశాఖ జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గంటాను వైసీపీలో చేర్చుకోకుండా అడ్డుకొనేందుకు ప్రత్యర్ధివర్గం ప్రయత్నాలు చేస్తోంది.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఆయనకు ఎర్త్ పెడుతున్నారు. గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకోవద్దని కోరుతూ వైసీపీ శ్రేణులు గురువారం నాడు ఆందోళనకు దిగాయి.
ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరమైన తర్వాత టీడీపీ కార్యక్రమాలకు గంటా శ్రీనివాసరావు దూరంగా ఉంటున్నాయి. పార్టీ మారుతారని ఆయనపై పలుమార్లు ప్రచారం సాగింది. కానీ ఈ ప్రచారాన్ని ఆయన గతంలో ఖండించారు.
అయితే ఈ నెల రెండో వారం తర్వాత గంటా శ్రీనివాసరావు వైసీపీ తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. విశాఖలో సీఎం జగన్ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.
గంటా శ్రీనివాసరావు అవినీతికి పాల్పడ్డాడని గత మాసంలో ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. ఆ తర్వాత విశాఖలో మీడియా సమావేశంలో కూడ గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు.
తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకొనేందుకు వైసీపీలో చేరేందుకు గంటా శ్రీనివాసరావు ప్రయత్నాలు చేస్తున్నారని అవంతి శ్రీనివాసరావు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయంలో గంటా శ్రీనివాసరావు అవినీతిపై అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు కూడ ఫిర్యాదు చేశారని కూడ అవంతి శ్రీనివాసరావు గుర్తు చేశారు.
గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడాన్ని మంత్రి అవంతి శ్రీనివాసరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ఆయన అవంతి శ్రీనివాసరావు గంటా అవినీతికి పాల్పడ్డాడని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
గంటా శ్రీనివాసరావును పార్టీ చేరకుండా విజయసాయిరెడ్డి ద్వారా అవంతి శ్రీనివాస్ చక్రం తిప్పారు. అయితే మరో మార్గం ద్వారా గంటా శ్రీనివాసరావు చేసిన ప్రయత్నాల విషయమై వైసీపీ నాయకత్వం నుండి సానుకూలంగా స్పందించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలోనే గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకోవద్దని విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు గురువారం నాడు ఆందోళన నిర్వహించాయి.
పద్మనాభం మండలం చిన్నాపురం జంక్షన్ వద్ద గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకోవద్దని వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. గంటాను పార్టీలో చేర్చుకోకుండా చివరి వరకు అవంతి శ్రీనివాస్ ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగడం ప్రాధాన్యత సంతరించుకొంది.
ఎవరిని పార్టీలో చేర్చుకోవాలో వద్దో అనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయమని మంత్రి అవంతి శ్రీనివాస్ పైకి చెబుతున్నా.. లోలోపల మాత్రం గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు గంటా శ్రీనివాసరావును వైసీపీలో చేరకుండా అడ్డుకొనేందుకు తన శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.