కోరిక తీర్చలేదని ప్రియురాలిపై వేడినూనె పోసి.. బంధించి, పలుమార్లు అత్యాచారం.. యువకుడి అరెస్ట్..
ఇంజనీరింగ్ విద్యార్థిని మీద వేడినూనె పోసి.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడిని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోరిక తీర్చనన్నందుకే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
ఏలూరు : ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిని బంధించి.. ఆమె మీద వేడి నూనె పోసి తీవ్రంగా గాయపరిచి.. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01eve355pzrq9cwchvckdm9b65/hot-oil-jpg_300x171xt.jpg)
ఈ ఘటన పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడిని 24 గంటల్లోనే ఎస్సీ డీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో అరెస్టు చేశారు. అతడిని జైలుకు పంపించారు.
బాధితురాలికి సత్వరంగా న్యాయం అందించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఏలూరు స్థానిక త్రీటౌన్ స్టేషన్లో సోమవారం సాయంత్రం దిశ డిఎస్పి కేవీ సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈ మేరకు వెల్లడించారు.
ఏలూరు జిల్లా దుగ్గిరాల గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని కాకినాడ జేఎన్ టీయూలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. సదర్ల అనుదీప్ అనే వ్యక్తి దుగ్గిరాల గ్రామానికే చెందినవాడు. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే అనుదీప్ ఏప్రిల్ 5వ తేదీన బాధితురాలిని కలుసుకోవడానికి కాకినాడ వెళ్లాడు. అప్పటికి ఇద్దరి మధ్య సఖ్యత బాగానే ఉంది. ఇద్దరూ కలిసి చెన్నైలోని వేలంగిణి మాత చర్చికి వెళ్లారు.
ఈస్టర్ రోజున అనుదీప్ తాను వేసుకున్న క్రీస్తు మాలను తీసేశాడు. ఆ తర్వాత పదవ తేదీ రాత్రి ఇద్దరూ కలిసి ఏలూరులోని దుగ్గిరాల జోసెఫ్ నగర్ లో ఉన్న అనుదీప్ నానమ్మ ఇంటికి వచ్చారు. అక్కడ నిందితుడు అనుదీప్ బాధితురాలైన ఆ యువతిని తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. అయితే, దీనికి ఆమె ఒప్పుకోలేదు.
మరుసటి రోజు కూడా మరోసారి అలాగే బలవంతం చేశాడు. కానీ ఆమె నిరాకరించింది. దీంతో అనుదీప్ తీవ్ర అగ్రహావేషాలకు లోనై.. వేడిగా మరుగుతున్న నూనెను ఆమె ఒంటిపై పోసాడు. అనుకోని ఈ పరిణామానికి ఆమె తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో తీవ్ర గాయాలపాలయ్యింది.
ప్రేమించిన యువతి అనే కనికరం కూడా లేకుండా.. ఆమెను అలాగే 12 రోజులపాటు ఇంట్లోనే బంధించాడు. ఆమె మీద పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు చంపేందుకు కూడా ప్రయత్నించాడు. దీంతో అతడి నుంచి ఎలాగో తప్పించుకుని.. అతడి ఫోన్ లాక్కుని.. తండ్రి కి ఫోన్ చేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా దిశా పోలీసులు నిందితుడైన అనుదీప్ మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండగా సోమవారం నాడు ఏలూరు కొత్త బస్టాండ్ సమీపంలో అరెస్టు చేశామని దిశా డిఎస్పి సత్యనారాయణ తెలిపారు.
నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాలను సేకరించి ల్యాబ్ కు పంపామని.. తెలిపారు. బాధితురాలికి త్వరితంగా న్యాయం చేసే దిశగా త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు నిందితుడైన అనుదీప్ మీద హిస్టరీ షీట్ ను తెరుస్తున్నట్లు పోలీసులు చెప్పారు. .