తండ్రి బాటలోనే జగన్: నాడు సబితకు, నేడు సుచరితకు హోం శాఖ
తండ్రి బాటలోనే వైఎస్ జగన్ పయనిస్తున్నాడు. తండ్రి మాదిరిగానే వైఎస్ జగన్ హోం మంత్రి పదవిని మహిళకు కేటాయించారు. తనను నమ్ముకొన్నవారికి కీలక పదవిని కట్టబెడతానని జగన్ కూడ సంకేతాలు ఇచ్చారు.
అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ తన మంత్రివర్గ సభ్యులకు శాఖలను శనివారం నాడు కేటాయించారు. హోం మంత్రి పదవిని మేకతోటి సుచరితకు కేటాయించారు. ఓ దళిత మహిళకు హోం మంత్రి పదవిని కేటాయించారు.
తండ్రి తరహలోనే మహిళకు హోంమంత్రి పదవిని కేటాయించారు. తొలి నుండి తన వెంట నడిచిన వారికి మంత్రివర్గంలో వైఎస్ జగన్ పెద్దపీట వేశాడు. పార్టీ కోసం కష్టనష్టాలను ఓర్చుకొని పార్టీ కోసం కష్టపడిన వారికి జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రెండో దఫా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండో దఫా కూడ తన మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డికి చోటు కల్పించారు. అయితే రెండో దఫా సబితా ఇంద్రారెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హోం మంత్రి పదవిని కట్టబెట్టారు.
2003లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల నుండి పాదయాత్రను ప్రారంభించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి రావడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడింది.
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ తర్వాత ఏ కొత్త పథకం, పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవేళ్ల నుండి ప్రారంభించేవారు. దీంతో సబితా ఇంద్రారెడ్డిని చేవేళ్ల చెల్లెమ్మగా పిలిచేవారు. చేవేళ్ల అంటే సెంటిమెంట్గా ఉండేది.
రచ్చబండ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభించకుండా చేవేళ్ల ప్రారంభిస్తే వైఎస్ఆర్ బతికేవాడని ఆనాడు కొందరు కాంగ్రెస్ నేతలు కూడ వ్యాఖ్యానించిన సందర్భాలు కూడ లేకపోలేదు.
వైఎస్ జగన్ కూడ తండ్రి తరహలోనే సుచరితకు హోం మంత్రి పదవిని కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీని వీడి మొదటి నుండి నడిచిన సుచరితకు హోం మంత్రి పదవిని కట్టబెట్టారు.