రాజకీయ గెంతులు: వెలుగు వెలిగి ఇప్పుడు అజ్ఢాతంలోకి...
రాజకీయ గెంతులు: వెలుగు వెలిగి ఇప్పుడు అజ్ఢాతంలోకి...
అమరావతి: ఒకప్పుడు రాష్ట్రరాజకీయాల్లో కీలక నేతలు వారంతా. ముఖ్యంగా కర్నూలు జిల్లా రాజకీయాన్ని కనుసైగతో శాసించిన నేతలు వారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వారంతా ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఉన్నారు
2014 ఎన్నికల్లో కనిపించిన వీరంతా 2019 ఎన్నికల్లో కనుచూపు మేరలో కనిపించకుండా పోయారు. 2019 ఎన్నికల్లో టికెట్ దొరక్క పార్టీలో మౌనంగా ఉన్నవారు కొందరైతే ఏం చెయ్యాలో సంకటస్థితిలో మరికొందరు సైలెంట్ గా ఉండిపోయారు.
కర్నూలు జిల్లా రాజకీయాలను తీవ్ర ప్రభావం చూపిన నాయకుల్లో ఏరాసు ప్రతాప్ రెడ్డి ఒకరు. కాంగ్రెస్ పార్టీ హయాంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన ఏరాసు ప్రతాప్ రెడ్డి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు.
2019 ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించినప్పటికి గౌరు చరితారెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి చేరి ఆఖరి నిమిషంలో టీడీపీ టికెట్ కొట్టేశారు. దీంతో ఆయన పోటీ చెయ్యకుండా పోయారు. దీంతో ఆయన 2019 ఎన్నికల్లో పొలిటికల్ స్క్రీన్ పై కనిపించలేదు.
ఇకపోతే కర్నూలు జిల్లా రాజకీయాల్లో మరో కీలక నేత ఎస్వీ మోహన్ రెడ్డి. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన ఎస్వీ మోహన్ రెడ్డికి కూడా 2019 ఎన్నికల్లో ఎదురుగాలి వీచింది. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కర్నూలు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఎస్వీ మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ గందరగోళానికి గురైంది.
శోభా నాగిరెడ్డి అన్నయ్యగా, భూమా నాగిరెడ్డి బావమరిదిగా కూడా మంచి గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కర్నూలు అసెంబ్లీ నుంచి గెలుపొందిన ఆయన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇవ్వడంతో ఆయన పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో చేసేది లేక తిరిగి సొంతగూటికి చేరాల్సి వచ్చింది
ఇకపోతే కర్నూలు జిల్లా రాజకీయాల్లో మరో పేరున్న నేత బుట్టా రేణుక. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కర్నూలు లోక్ సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీకి అనుబంధంగా మారిపోయారు. 2016 నుంచి దాదాపు టీడీపీ నేతగానే వ్యవహరించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆమెకు కర్నూలు లోక్ సభ సీటు కన్ఫమ్ చేసినప్పటికీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం హ్యాండ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడు అయినటువంటి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించి బుట్టాను రాజకీయాల్లో బుట్టదాఖలు లేకుండా చేశారు.
అటు సొంత పార్టీని వదులుకుని, ఇటు నమ్ముకున్న పార్టీ కూడా హ్యాండ్ ఇవ్వడంతో ఆమె రాజకీయాల్లో తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఆఖరినిమిషంలో సొంతగూటికి చేరిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొందామని భావించినప్పటికీ నాయకులు అంగీకరించకపోవడంవతో చేసేది లేక ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.
కర్నూలు జిల్లా రాజకీయాల్లో మరో కీలక నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఈయన తెలుగుదేశం నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసిన బైరెడ్డి రాష్ట్ర విభజనకు ముందు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రాయలసీమ హక్కుల సాధన కోసం రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో పార్టీని స్థాపించారు.
అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ట్రాక్టర్ యాత్ర చేపట్టారు కూడా. కాంగ్రెస్ పార్టీలో చేరారని గ్రామస్థాయికి చేరకముందే మళ్లీ పసుపుకండువా కప్పేసుకున్నారు.
టీడీపీ తరపున శ్రీశైలం టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ రాకపోవడంతో ఆయన నిరాశ చెంది రాజకీయాలకు దూరమయ్యారు. 2019 ఎన్నికల ప్రచారంలో కానీ ఎక్కడా కనిపించకుండా పోయారు. వీరే కాదు ఎంతోమంది కీలక నేతలను అజ్ఞాతంలోకి నెట్టేశాయి 2019 ఎన్నికలు.