16 ఎకరాల్లో కుమారస్వామి ఆలయం...శ్రీశైలంలో: జగన్ కు శృంగేరి పీఠం ఆహ్వానం
కుమార విహారం ప్రాజెక్ట్లో భాగంగా శ్రీశైలంలో 16 ఎకరాల విస్తీర్ణంలో కుమారస్వామి దేవాలయాన్ని నిర్మించనుంది శృంగేరి శారదాపీఠం.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక శైవక్షేత్రం శ్రీశైలంలో కుమార విహారం పేరుతో నిర్మించనున్న కుమారస్వామి ఆలయ ప్రాజెక్ట్ను ఆవిష్కరించేందుకు శృంగేరి శారదాపీఠం ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ను ఆహ్వానించారు. కుమార విహారం ప్రాజెక్ట్లో భాగంగా 16 ఎకరాల విస్తీర్ణంలో కుమారస్వామి దేవాలయాన్ని నిర్మించనుంది శృంగేరి శారదాపీఠం. 2022 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు.
సీఎం జగన్కు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు ప్రతినిధులు. శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ భారతీ తీర్ధస్వామి వారి దివ్య ఆశీస్సులతో, సూచనలతో ఈ ప్రాజెక్ట్ను చేపట్టినట్లు సీఎంకి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఆధ్యాత్మిక, భక్తి భావం ప్రజల్లో పెంపొందినప్పుడే మానసిక ప్రశాంతతతో కూడిన జీవనం సాధ్యమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీలు వి. విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శృంగేరి శారదా పీఠ ప్రతినిధులు, ప్రిన్సిపల్ కన్సల్టెంట్స్ విబి టెక్నోక్రాట్స్ బృందం బి. లక్ష్మీ ప్రభాకర్, చిన్నబాబు, విజయభాస్కర్, శేషుస్వామి, అరుణ్శర్మలు పాల్గొన్నారు.