జనసేనలో గుబులు, వైసీపీ-బీజేపీలోకి నేతల క్యూ: రంగంలోకి పవన్
ఇకనైనా వలసలకు అడ్డుకట్ట వేయాలన్న జనసేన పార్టీ నేతల సూచనల పట్ల పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. పీఏసీ, పొలిట్ బ్యూరో సమావేశాలతోనైనా పవన్ కళ్యాణ్ వలసలకు అడ్డుకట్ట వేస్తారా లేదా అనేది వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతారనుకున్న పవన్ కళ్యాణ్ కేవలం ఒక్కరిని మాత్రమే గెలిపించుకోగలిగారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారని ఎదురుచూసిన జనసేన అభిమానులకు నిరాశేమిగిలింది.
పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీ తీవ్ర నిరాశనిస్పృహాలకు గురైంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం మెక్కవోని ధైర్యంతో ముందుకు పోతున్నారు. పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా జనసేన పార్టీలో కీలక కమిటీలను నియమించారు పవన్ కళ్యాణ్. తన సోదరుడు నాగబాబు నేతృత్వంలో సమన్వయ కమిటీని నియమించారు.
అలాగే జనసేన పార్టీ సీనియర్ నేత ,పవన్ కళ్యాణ్ సన్నిహితుడు అయినటువంటి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కమిటీలను సైతం నియమించారు. అంతేకాదు ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు.
జగన్ 100 రోజులపాలనపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రెస్మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు ఒక పుస్తకాన్ని సైతం విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తీరు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
ఇకపోతే రైతు భరోసా పథకంపైనా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ఆర్ రైతు భరోసా పథకంపై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మాటతప్పారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కో రైతుకు రూ.18,500 ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.13,500 చెల్లిస్తున్నారంటూ మండిపడిన సంగతి తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ అయినప్పటికీ వెనకడుగువేయలేదు. పార్టీని బలంగానే ముందుకు నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో జనసేన పార్టీకి చెందిన కీలక నేతలు రాజీనామాలు చేయడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు అడుగులు వేస్తున్నప్పటికీ కొందరు రాజకీయ నేతలు మాత్రం తమ భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా పార్టీని వీడుతున్నారు.
జనసేన పార్టీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీమంత్రి రావెల కిషోర్ బాబు దగ్గర నుంచి మెుదలుపెడితే మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వరకు ఇలా ఎంతోమంది పార్టీని వీడుతున్నారు.
ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించిన విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి నేతలు వైసీపీ, బీజేపీలోకి క్యూ కట్టడంతో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు మాజీమంత్రి రావెల కిషోర్ బాబు. అయితే ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఘోరంగా ఓటమిపాలయ్యారు. అనంతరం ఆయన బీజేపీ గూటికి చేరిపోయారు.
ఇకపోతే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో నేత ఆకుల సత్యనారాయణ సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఓటమి అనంతరం స్తబ్ధుగా ఉన్న ఆకుల సత్యనారాయణ ఇటీవలే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన సతీమణి లక్ష్మీపద్మావతి సైతం జనసేన పార్టీకి రాజీనామా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ పరిణామాలు జనసేన పార్టీకి కాస్త ఇబ్బందేనని చెప్పుకోవాలి.
ఇకపోతే విశాఖపట్నం జిల్లాకు చెందిన మరో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య సైతం జనసేన పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన మరో కీలక నేత సైతం జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పసుపులేటి సుధాకర్ జనసేన పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో కావలి శాసన సభ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు పసుపులేటి సుధాకర్.
ఇలా ఒక్కొక్కరు పార్టీ వీడుతుండటంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలని కోరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈనెల 18న మధ్యాహ్నాం 3 గంటలకు జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
అలాగే ఈనెల 20న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం జరగనున్నట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇకనైనా వలసలకు అడ్డుకట్ట వేయాలన్న జనసేన పార్టీ నేతల సూచనల పట్ల పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. పీఏసీ, పొలిట్ బ్యూరో సమావేశాలతోనైనా పవన్ కళ్యాణ్ వలసలకు అడ్డుకట్ట వేస్తారా లేదా అనేది వేచి చూడాలి.