జగన్ చేతికి రాజధాని కమిటీ నివేదిక: అమరావతిపై ఉత్కంఠ
ఏపీ రాజధానిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదికను అందించింది.
ఏపీలో రాజధాని ఏర్పాటు విషయమై నిపుణుల కమిటీ నివేదికను కేబినెట్ సమావేశంలో చర్చించి నివేదికను బహిర్గతం చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని సమాచారం. ఈ విషయమై ఈ నెల 27వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టుగా ప్రచారం సాగింది.
ఏపీ రాజధాని ఏర్పాటుపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు మధ్యాహ్నం నివేదికను అందించింది. మూడు రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముగింపు రోజున ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందనే సంకేతాలను సీఎం జగన్ ఇచ్చారు.
సీఎం జగన్ ప్రకటనపై అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలకు దిగారు. రాజధానిని అమరావతి నుండి తరలించకూడదని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీకి రాజధాని ఏర్పాటు విషయమై ఈ ఏడాది సెప్టెంబర్ 13వ తేదీన సీఎం జగన్ జీఎన్ రావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది.
ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల పరిస్థితులను అధ్యయనం చేసింది. అంతేకాదు ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను కూడ కమిటీ ఈ నివేదికలో పొందుపర్చినట్టుగా సమాచారం.
నివేదికలో ఉన్న అంశాలను జీఎన్ రావు కమిటీ బృందం సీఎం జగన్కు కమిటీ సభ్యులు వివరించారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదికలోని అంశాల గురించి సీఎం జగన్ కు కమిటీ సభ్యులు వివరించారు.
ఈ నివేదికలోని అంశాలను కేబినేట్ భేటీలో చర్చించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ మేరకు ఈ నెల 27వ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేసింది.జీఎన్ రావు కమిటీ కూడ శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ప్రస్తావించింది. శివరామకృష్ణన్ కమిటీ అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు సరైంది కాదని అభిప్రాయపడింది. కానీ అమరావతిలోనే రాజధానిని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి రాజధాని విషయమై జీఎన్ రావు కమిటీ ఏ రకమైన నివేదిక ఇచ్చిందనే విషయమై అందరిలో ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి రాజధాని విషయమై జీఎన్ రావు కమిటీ ఏ రకమైన నివేదిక ఇచ్చిందనే విషయమై అందరిలో ఉత్కంఠ నెలకొంది.మరో వైపు జనవరి లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ఈ సమావేశంలో జీఎన్ రావు నివేదికను అఖిలపక్ష సమావేశానికి వివరించనున్నారు.