- Home
- Andhra Pradesh
- Elephants Attack : శివ భక్తులపై ఏనుగులు అందుకే దాడిచేసాయా? అసలు గత అర్ధరాత్రి ఏం జరిగింది?
Elephants Attack : శివ భక్తులపై ఏనుగులు అందుకే దాడిచేసాయా? అసలు గత అర్ధరాత్రి ఏం జరిగింది?
గడిచిన రాత్రి విషాదాన్ని మిగిల్చింది. శివనామస్మరణతో పాదయాత్రగా వెళుతున్న భక్తులపై ఏనుగుల గుంపు దాడిచేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలివే...

Elephant attack on devotees in Andhra Pradesh
Andhra Pradesh Accident : శివరాత్రి పండక్కి ముందు ఆంధ్ర ప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోనే ఓ శివాలయానికి నడుచుకుంటూ వెళుతున్న భక్తులపై ఒక్కసారిగా అటవీ ఏనుగుల గుంపు దాడిచేసింది. దీంతో ఐదుగురు భక్తులు చనిపోగా మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. దైవ దర్శనానికి వెళుతున్నామని ఇంట్లోంచి బయలుదేరినవారు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఓబులవారిపల్లె మండలం వై. కోట ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా స్పందించారు. ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.
ఏనుగుల దాడిలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. క్షతగాత్రులు కోలుకునేవరు వైద్య సహయం అందించడమే కాదు ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. ఇలా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్.
Annamaiah district Elephant attack
గత అర్ధరాత్రి అసలేం జరిగింది :
అన్నమయ్య జిల్లా ఓబువారిపల్లె మండలం వై.కోట సమీపంలో గుండాల కోన వద్ద సిద్దేశ్వర ఆలయం ఉంది. దట్టమైన అటవీప్రాంతంలో ఈ మహిమాన్విత శివాలయం ఉంది. శివరాత్రి పండగ వేళ అన్ని శివాలయల్లో మాదిరిగానే ఇక్కడికి కూడా భారీగా భక్తులు తరలి వెళుతుంటారు. రేపు (ఫిబ్రవరి 26) శివరాత్రి కావడంతో ఈ ఆలయానికి భక్తుల ప్రయాణం ప్రారంభమయ్యింది.
గుండాలకోనలోని సిద్దేశ్వర ఆలయంలో శివరాత్రి జాగరణ చేపట్టాలని వై.కోట కన్నెగుంట కాలనీకి చెందినవారు భావించారు. ఈ కాలనీకి చెందిన దాదాపు 30 మంది సోమవారం రాత్రి ప్రయాణం ప్రారంభించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో దట్టమైన అటవీమార్గంలో ఈ బృందం ప్రయాణిస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది.
శేషాచలం అడవుల్లోని ఈ సిద్దేశ్వర ఆలయానికి వెళుతున్న భక్తులపై ఒక్కసారిగా ఏనుగుల గుంపు దాడిచేసింది. రాత్రి సమయంలో ఎప్పుడూలేనిది అలికిడి మొదలవడంతో ఏనుగులు బెదిరిపోయినట్లున్నాయి. అందువల్లే ఒక్కసారిగా పాదయాత్ర చేపట్టిన భక్తులపైకి దూసుకెళ్లాయి. ఆ భారీ ఏనుగుల కాళ్లకింద నలిగి అమాయక భక్తులు ప్రాణం కోల్పోయారు.
ఏనుగుల దాడిలో మృతిచెందినవారిలో మహిళలు కూడా ఉన్నారు. తుపాకుల మణమ్మ అనే మహిళతో పాటు వంకాయల దినేష్, చంగల్రాయుడు అనే మరో ఇద్దరు మృతిచెందినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతావారి వివరాలు తెలియాల్సి ఉంది. ఏనుగుల దాడిలో గాయపడినవవారిని రైల్వే కోడూరు హాస్పిటల్ కు తరలించారు.
AP Elephant attack, Pawan Kalyan
చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి :
శివరాత్రి పండగవేళ అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణ వ్యక్తం చేసారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని... గాయపడివారికి హుటాహుటిన హాస్పిటల్ కు తరలించాలని ఆ జిల్లా అధికారులు, పోలీసులను ఆదేశించారు.
ఇక మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది కూటమి ప్రభుత్వం. ఈ ఘటనపై సమాచారం అందించవెంటనే అసెంబ్లీ సమావేశాలకు హాజరైన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ ను వెంటనేవెళ్లి పరిస్థితిని సమీక్షించాలని... బాధిత కుటుంబాలకు అండగా నిలిచి సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ సూచించారు. అలాగే ఈ దుర్ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని అటవీశాఖ అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.
ఇప్పటికే పలుమార్లు ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయని... వాటినుండి తమ పంటలను కాపాడాలని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. కూటమి అధికారంలోకి రాగానే పవన్ కల్యాణ్ వారి సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక ప్రభుత్వంలో చర్చించిన విషయం తెలిసిందే. ఇలా ఏనుగులను నియంత్రించే చర్యలు చేపడుతున్న సమయంలోనే ఇలా ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్రంగా గాయపడటంతో విషాదం నెలకొంది.