మింగుడు పడని కేశినేని, బుద్ధా వెంకన్న గరం: చంద్రబాబుకు తలనొప్పి
విజయవాడ: ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు సద్దుమణగడం లేదు. విజయవాడ తెలుగుదేశం పార్టీలో నెలకొన్న విభేదాలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తీరు చంద్రబాబుకు మింగుడు పడడం లేదని అంటున్నారు.
విజయవాడ: ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు సద్దుమణగడం లేదు. విజయవాడ తెలుగుదేశం పార్టీలో నెలకొన్న విభేదాలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తీరు చంద్రబాబుకు మింగుడు పడడం లేదని అంటున్నారు.
తాజాగా కేశినేని నాని, విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్నకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కేశినేని నాని ట్విట్టర్ వేదికగా తమ పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. కేశినేని నాని తీరుపై బుద్ధా వెంకన్న పార్టీ నేతల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ కేశినేని నాని విజయవాడ లోకసభ స్థానం నుంచి విజయం సాధించారు. తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా టీడీపి విజయం సాధించింది. ఫలితాలు వెలువడి పార్టీ పరాజయం పాలైన తర్వాత కేశినేని ట్విట్టర్ వేదికగా పార్టీ నేతలపై చేస్తున్న విమర్శలు చంద్రబాబుకు తలనొప్పిగానే మారాయి. కేశినేని నానిని పిలిపించి మాట్లాడినా కూడా ఫలితం లేకుండా పోయింది
కృష్ణాజిల్లాకు చెందిన పార్టీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఆ మధ్య కేశినేని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సంచలన రేపాయి. తాజాగా మరికొందరు నేతలపై కూడా ఆయన పెట్టిన పోస్టులు వివాదానికి దారి తీస్తున్నాయి.
గుడివాడ వైపీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి మంత్రి పదవి దక్కిన సందర్భంలో కేశినేని నాని స్పందించిన తీరు సొంత పార్టీవారినే కాకుండా ఇతరులను కూడా ఆశ్చర్యపరిచింది దేవినేని ఉమాకు కొడాలి నాని రుణపడి ఉండాలనిఆయన ఓ పోస్ట్ పెట్టారు. దేవినేని ఉమాపై ఆయన ఆ విధంగా వ్యంగ్యాస్త్రాలు విసిరారని భావించారు.
ఆ తర్వాత కేశినేని చేసిన మరో పోస్టు కూడా తీవ్ర సంచలనానికి దారి తీసింది ''పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప'' అని ఆయన పోస్టు చేసారు. సొంత పార్టీపైనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు కేశినేని నానిని పిలిచి మాట్లాడారు.
తనకు చంద్రబాబు ఇవ్వజూపిన పార్లమెంట్లో విప్ పదవిని కేశినేని నాని తిరస్కరించడం కూడా చర్చనీయాంశంగా మారింది. "నేను పార్టీలో ఎప్పుడూ ధిక్కారస్వరం వినిపిస్తూనే ఉంటా. అది నా నైజం. నేను నిజం మాత్రమే మాట్లాడతాను'' అంటూ ఒక ట్వీట్ ద్వారా నాని స్పష్టంచేశారు. తెలుగుదేశం పార్టీని వీడి బిజెపిలో చేరడానికి నాని సిద్ధపడ్డారనే ప్రచారం కూడా ముందుకు వచ్చింది.
చంద్రబాబు పిలిపించి మాట్లాడిన తర్వాత కూడా తాజాగా కేశినేని నాని చేసిన మరో ట్వీట్ పార్టీలో చర్చకి దారితీసింది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం షోమ్యాన్ల అవసరం లేదనీ, టాస్క్ మాస్టర్ల అవసరం ఉందనీ కేశినేని నాని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యల వ్యవహారం చంద్రబాబు వరకు వెళ్లింది.
ఇటీవల విజయవాడ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని తన కార్యాలయంలో కార్పొరేటర్ల సమావేశం ఏర్పాటుచేసి అందులో సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థలో తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు
తూర్పు నియోజవర్గంలో టీడీపీ విజయం సాధించిందని, సెంట్రల్ నియోజకవర్గంలో కేవలం 25 ఓట్ల తేడాతో ఓటమి చెందామని, నిజం చెప్పాలంటే టీడీపీకి అది ఓటమి కాదని, అక్కడ కూడా గెలిచినట్టే భావించవచ్చునని అని కేశినేని నాని అన్నారు. ఈసారి ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో నాగుల్ మీరా పోటీచేస్తారని కూడా ఆయన ఏకపక్షంగా ప్రకటించారు,
ఈ సమావేశానికి నగర పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్నను ఆహ్వానించారు. కానీ హైదరాబాద్లో వేరే కార్యక్రమం ఉండటంతో ఆయన హాజరుకాలేకపోయారు. అయితే, ఈ సమావేశంలో నాని చేసిన వ్యాఖ్యలు బుద్దా వెంకన్నకు కొంతమంది కార్పొరేటర్లు చేరవేశారు. పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలే కాని నాని ఎలా వ్యాఖ్యలు చేస్తారంటూ ఎంపీ నాని అనుచరుల వద్ద బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
షోమ్యాన్లు అంటూ సోషల్ మీడియాలో నాని పెట్టిన పోస్టు కూడా వెంకన్నకు మరింత ఆగ్రహం తెచ్చిపెట్టింది. తనను ఉద్దేశించి నాని ఆ వ్యాఖ్యలు చేశారని ఆయన భావిస్తున్నారు. కావాలనే తనను కార్నర్ చేస్తున్నారనీ, తాను తిరగబడితే పరిస్థితి వేరే విధంగా ఉంటుందనీ పార్టీ పెద్దల వద్ద వెంకన్న అన్నట్లు సమాచారం.
చంద్రబాబుకు బుద్దా వెంకన్న వీరవిధేయుడు. ఈ స్థితిలో తాజాగా వెంకన్న, నానిల మధ్య రాజుకున్న వివాదం చంద్రబాబు వద్దకు చేరినట్లు తెలుస్తోంది. పశ్చిమ నియోజకవర్గంలో నాగుల్ మీరా పోటీచేస్తారని ఎంపీ కేశినేని నాని ఏకపక్షంగా చేసిన వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న వంటి మండిపడుతున్నారు. చంద్రబాబుకు చెప్పకుండా నాని ఏకపక్షంగా ఆ విషయాన్ని ఎలా ప్రకటిస్తారని మండిపడుతున్నారు.