పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన సీఎం జగన్... ఏరియల్ సర్వే
పోలవరం ప్రాజెక్ట్ పనులను ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ పరిశీలించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం సంబంధిత అధికారులతో పోలవరం పనులపై రివ్యూ చేపట్టారు.
ఏలూరు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా గోదావరి నది నిండుకుండలా మారడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
ప్రత్యేక హెలికాప్టర్ లో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు సీఎం జగన్, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్. ముందుగా సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు. అధికారులతో కలిసి సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.
పోలవరం ప్రాజెక్టును హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి సీఎం జగన్ స్వయంగా నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్కు వివరించారు. అనంతరం సీఎం జగన్ పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. ఆ తర్వాత స్పిల్ వే పరిశీలనకు సీఎం జగన్ బయలుదేరారు.
మధ్యాహ్నం అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. గడువులోగా పోలవరం పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా 2019 జూన్ 20న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయడం, ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల నిర్మాణం... సమాంతరంగా నిర్వాసితులకు పునరావాసం, కాఫర్ డ్యామ్ల మధ్య ఈసీఆర్ఎఫ్ను చేపట్టి వరదలోనూ పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు. ఆలోగా కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాలు, డిస్ట్రిబ్యూటరీల పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేశారు.
టీడీపీ సర్కారు నామినేషన్ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిందంటూ పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించి రూ.838 కోట్లను ఆదా చేసినట్లు వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. ప్రచార్ ఆర్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ 2020 ఫిబ్రవరి 28, డిసెంబర్ 14న క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.