రాజకీయాల్లో చేరి తప్పు చేశా, వద్దన్నా బాబు వినలేదు: మురళీమోహన్ సంచలనం
పదేళ్ల పాటు రాజకీయాల్లో తాను ఎంతో కోల్పోయినట్టుగా సినీ నటుడు మురళీమోహన్ ప్రకటించారు. రాజకీయాల్లో తన స్వంత డబ్బుల్నే ఖర్చు చేసుకొన్నానని ఆయన తేల్చి చెప్పారు.
రాజకీయాల్లో చేరి అతి పెద్ద తప్పు చేశానని మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ ప్రకటించారు. ఇష్టం లేకున్నా తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. రాజకీయాల్లో చేరిన పదేళ్ల సమయంలో చాలా కోల్పోయినట్టుగా ఆయన తెలిపారు.
తాను రాజకీయాలను వదిలేసినట్టుగా మురళీమోమన్ ప్రకటించారు. తనకు సినిమా పరిశ్రమ ఉంది. సంతోషంగా సినిమాలు చేసుకొంటానని ఆయన చెప్పారు. జనంలో పడి పోటీ చేస్తే తన కష్టాన్ని గుర్తించి మెచ్చుకొనే వాళ్లు ఉండరన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం అంటే లేనిపోనివి మనపై వేస్తారు. ఇలాంటి సమయంలో తన విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు.
రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా... టీడీపీలో చేరి తప్పు చేశానని ఇప్పటికీ బాధపడుతున్నానని ఆయన చెప్పారు. తాను నిజాయితీగా రాజకీయాలు చేశాననని చెప్పారు. ఏనాడూ ఒక్క రూపాయిని కూడ ఆశించలేదన్నారు.
తన స్వంత డబ్బుల్నే రాజకీయాల కోసం ఖర్చు చేసినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. కానీ, రాజకీయాలను వదిలేస్తే ... తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తిన్నదంతా కక్కి రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని అంటున్నారన్నారు.
తనకు డబ్బులు కావాలంటే వ్యాపారాలు లేవా, సినిమాలు లేవా, రియల్ ఏస్టేట్ లేదా అని ఆయన ప్రశ్నించారు. తాను బలవంతంగానే రాజకీయాల్లోకి వచ్చినట్టుగా ఆయన చెప్పారు. ఎన్టీఆర్ బతికున్న సమయంలో రాజకీయాల్లోకి రావాలని తనను కోరితే తాను నిరాకరించినట్టుగా ఆయన చెప్పారు. తనను ఎంపీగా పోటీ చేయాలని కోరితే తనకు అనుభవం లేదు.. పోటీ చేయనని చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కానీ, చంద్రబాబు తనను పిలిచి రాజకీయాల్లోకి రావాలని కోరినట్టుగా ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి రాలేనని కూడ చంద్రబాబుకు తాను తెగేసి చెప్పినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. అందరూ అలాగంటే ఎలా అని తనను రాజకీయాల్లో చేరేలా ఒప్పించారని మురళీమోహన్ చెప్పారు. చంద్రబాబు కన్విన్స్ చేయడంతో తాను రాజకీయాల్లో చేరినట్టుగా ఆయన చెప్పారు.
రాజకీయాల్లో చేరిన తర్వాత తాను తీవ్రంగా నష్టపోయినట్టుగా ఆయన చెప్పారు. తన ఆరోగ్యం, సమయం, ట్రస్ట్ కార్యక్రమాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నానన్నారు. అంతేకాదు రాజకీయాలకు కూడ గుడ్ బై చెబుతున్నట్టుగా ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
మురళీమోహన్ 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా రాజమండ్రి ఎంపీ స్థానంనుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014 ఎన్నికల్లో మురళీమోహన్ రాజమండ్రి నుండి పోటీ చేసి విజయం సాధించాడు. 2019 ఎన్నికల్లో మురళీమోహన్ కోడలు మాగంటి రూప పోటీ చేసి ఓటమి పాలైంది.