పవన్ కల్యాణ్ ప్రత్యర్థే, చిరంజీవితో భేటీ: వైఎస్ జగన్ వ్యూహం ఇదీ...
అమరావతి: తమ్ముడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోరాటం చేస్తున్నారు. ఆ స్థితిలో మెగాస్టార్ చిరంజీవి వైఎస్ జగన్ తో భేటీ కాబోతున్నారు. ఇది ఒక రకంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. పవన్ కల్యాణ్ తనపై పోరాటం చేస్తున్న తరుణంలో చిరంజీవికి జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం కూడా ఆశ్చర్యకరమైన విషయమే.
అమరావతి: తమ్ముడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోరాటం చేస్తున్నారు. ఆ స్థితిలో మెగాస్టార్ చిరంజీవి వైఎస్ జగన్ తో భేటీ కాబోతున్నారు. ఇది ఒక రకంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. పవన్ కల్యాణ్ తనపై పోరాటం చేస్తున్న తరుణంలో చిరంజీవికి జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం కూడా ఆశ్చర్యకరమైన విషయమే.
నిజానికి, వైఎస్ జగన్ తో చిరంజీవి ఈ నెల 11వ తేదీన భేటీ కావాల్సి ఉండింది. కానీ, అది 14వ తేదీకి వాయిదా పడింది. ఇదిలావుంటే, జగన్ తో భేటీ విషయంలో చిరంజీవి ఆలోచనలు ఏమిటి, చిరంజీవికి జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడంలో జగన్ వ్యూహం ఏమిటి అనే విషయాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది.
చిరంజీవితో భేటీకి తాను అంగీకరించడం ద్వారా జగన్ ప్రజల్లోకి స్పష్టమైన సంకేతాలను పంపించదలుచుకున్నట్లు అర్థమవుతోంది. సైరా నరసింహా రెడ్డి రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. జగన్ రాయలసీమకు చెందినవారు. రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడి మీద సినిమా తీసిన రామ్ చరణ్ ను, అందులో నటించిన చిరంజీవిని కలుసుకోవడం వల్ల ప్రజల్లోకి సానుకూల సంకేతాలు వెళ్తాయనేది జగన్ భావించి ఉండవచ్చు.
అంతకన్నా ప్రధానమైన విషయం పవన్ కల్యాణ్ రాజకీయాలకు సంబంధించింది. పవన్ కల్యాణ్ తనకు ప్రత్యర్థి అయినంత మాత్రాన చిరంజీవిని దూరం పెట్టడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుందని జగన్ అనుకుని ఉంటారు. చిరంజీవిని ఆదరించడం ద్వారా మెగా ఫ్యాన్స్ కూడా తన పట్ల సానుకూల ధోరణిలో ఆలోచించవచ్చుననే ఆయన అభిప్రాయపడవచ్చు.
భేటీకి అంగీకరించకపోతే చిరంజీవి నొచ్చుకునే ప్రమాదం ఉంది. అది తనకు నష్టం చేస్తుందనే విషయం జగన్ కు తెలుసు. చిరంజీవితో భేటీ వల్ల ఏ రకంగా చూసినా తనకు అనుకూల ప్రయోజనాలే ఉంటాయని జగన్ కు తెలియంది కాదు. అందువల్ల జగన్ చిరంజీవికి అపాయింట్ మెంట్ ఖరారు చేశారు. పవన్ కల్యాణ్ ప్రత్యర్థి అయినంత మాత్రాన ఆయన అన్నయ్య చిరంజీవికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదనే విమర్శలను ఎదుర్కోవడం జగన్ కు ఇష్టం లేదు.
చిరంజీవి జగన్ ను కలవడానికి సిద్ధపడడం పవన్ కల్యాణ్ కు ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెడితే, అది ఆయనకు కొంత మేరకు నష్టం చేయవచ్చు. అయితే, పవన్ కల్యాణ్ రాజకీయాల విషయంలో చిరంజీవి స్పష్టంగానే ఉన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం ఆయనకు ఇష్టం లేదు. ప్రజా రాజ్యం పార్టీ అనుభవాలు, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా అనుభవాలు చిరంజీవిని విసిగించాయనే చెప్పాలి. అలాంటి స్థితిలోనే ఆయన తిరిగి సినిమాల్లోకి ప్రవేశించారు.
రాజకీయాలకు పూర్తిగా దూరం పాటిస్తూ పూర్తి స్థాయిలో సినిమాలకే అంకితం కావాలని చిరంజీవి గట్టి నిర్ణయమే తీసుకున్నారు. సైరా నరసింహా రెడ్డి సినిమా ద్వారా ఆయన ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. సైరా సినిమాను అన్ని రకాలుగా ప్రమోట్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. అందుకే ఆయన జగన్ ను కలిసి సినిమా చూడాల్సిందిగా కోరనున్నారు.
జగన్ తో చిరంజీవి భేటీ పరిణామాన్ని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారనేది ప్రశ్న. మెగా ఫ్యాన్స్ లో చీలిక వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కు చిరంజీవి మరో తమ్ముడు, సినీ నటుడు నాగబాబు మద్దతు పలుకుతున్నారు. జనసేన పార్టీలో ముఖ్యమైన పాత్రను కూడా పోషిస్తున్నారు. చిరంజీవిపై పవన్, నాగబాబు రాజకీయాల ప్రబావం ఏ విధంగా పడుతుందనే చూడాల్సి ఉంది.