చంద్రబాబుకు కొరకరాని కొయ్య: ఏపీలో ఎల్వీయే కేంద్రబిందువు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కేంద్ర బిందువుగా మారారు. ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాల్లో ఎల్వీ సుబ్రమణ్యం తీసుకొన్న నిర్ణయాలను టీడీపీ బహిరంగంగానే వ్యతిరేకించారు. టీడీపీ, సీఎస్ల మధ్య ఉప్పు, నిప్పు మాదిరిగా ఉంది పరిస్థితి.
తాజాగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకోవడంలో సీఎస్ హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఎల్వీ సుబ్రమణ్యం ఖండించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీకి, పార్లమెంట్కు ఎన్నికలు జరిగాయి. అయితే పోలింగ్కు కొన్ని రోజుల ముందుగానే సీఎస్గా ఉన్న అనిల్ పునేఠను ఈసీ బదిలీ చేసింది. సీఎస్గా ఎల్వీ సుబ్రమణ్యంను చీఫ్ సెక్రటరీగా ఈసీ నియమించింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రమణ్యాన్ని నియమించే విషయంలో ఈసీ కనీసం తమతో సంప్రదించలేదని కూడ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
మరో వైపు జగన్ ఆస్తుల కేసులో ఎల్వీ సుబ్రమణ్యం కూడ ఉన్నాడని... ఎన్నికలు జరిగే సమయంలో ఇలాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎలా నియమిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతలు పలువురు సీఎస్పై పలు రకాల విమర్శలు చేశారు.
చంద్రబాబునాయుడు వ్యాఖ్యలను నిరసిస్తూ రిటైర్డ్ ఐఎఎస్లు రాష్ట్ర గవర్నర్ నరసింహాన్కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై బాబుపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఐఎఎస్లు గవర్నర్ను కోరారు. గవర్నర్కు రిటైర్డ్ ఐఎఎస్లు ఫిర్యాదులు చేయడంపై కూడ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించడం... ఏపీలో చోటు చేసుకొన్న పరిణామాలపై మాజీ ఐఎఎస్లు ఎందుకు స్పందించలేదో చెప్పాలని బాబు ప్రశ్నించారు.
ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు, సీఆర్డీఏ సమీక్ష నిర్వహించడంపై ఈసీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన అధికారులకు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నోటీసులు జారీ చేశారు.
మరో వైపు ఓ ఆంగ్ల దినపత్రికకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడ ఆయనకు ఎలాంటి అధికారులు ఉండవని కూడ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఈ విషయమై ఎల్వీ సుబ్రమణ్యాన్ని చంద్రబాబునాయుడు వివరణ కోరారు.
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు మాత్రమే ఎన్నికల సంఘం పరిధిలో మాత్రమే పనిచేస్తారని... ఎన్నికల సంఘం పరిధిలో లేని అధికారులు మాత్రం సాధారణ పరిపాలన కిందకు వస్తారని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్కు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తే వారిపై చర్యలు తీసుకొంటామని బాబు తేల్చి చెప్పారు.ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఉద్దేశించి చేసినవేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రివ్యూలు చేసిన విషయాన్ని కూడ బాబు గుర్తు చేశారు. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కూడ సీఎస్లు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తున్నా... ఏపీలో మాత్రం సీఎస్ మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాబు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సీఎస్ను తాను అడుక్కోవాలా... అని కూడ బాబు ఒకానొక దశలో వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ప్రజల సమస్యలను చర్చించేందుకు గాను కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 10వ తేదీన కేబినెట్ నిర్వహించాలని సీఎస్కు నోట్ పంపారు. ఈ విషయమై సీఎస్ ఈసీకి నివేదిక పంపారు. అయితే కేబినెట్ ఎజెండాకు అనుమతి తీసుకోవాలని ఈసీ సూచించింది. ఎజెండాను ఈసీకి పంపి అనుమతి వచ్చిన తర్వాత ఈ నెల 14 వతేదీన కేబినెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఎస్ పనితీరును మంత్రివర్గం అభినందించినట్టుగా కూడ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు.
ఇదిలా ఉంటే తాజాగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్ల్లో ఈ నెల 19వ తేదీన రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.అయితే రీ పోలింగ్ నిర్వహించాలనే నిర్ణయం సీఎస్ ఓఎస్డీ సిఫారసు ఆధారంగానే ఈసీ నిర్ణయం తీసుకొందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వైసీపీ ఫిర్యాదు ఆధారంగా సీఎస్ ఓఎస్డీ నుండి వచ్చిన లేఖ ఆధారంగా ఈసీ రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తమ అభ్యర్థి పులివర్తి నాని ఫిర్యాదును ఈసీ పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు సీఈసీ సునీల్ ఆరోరాను కలిసి చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్పై నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంపై చంద్రబాబునాయుడు సునీల్ ఆరోరాను కలిసి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది.