పవన్ కల్యాణ్ భవిష్యత్తు బిజెపి ముఖం: ఏపీలో పాగాకు పక్కా ప్లాన్
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వెనక్కి నెట్టి తాను ముందుకు రావడం ద్వారా వైసీపీకి తామే ప్రత్యామ్నాయమని ప్రజలకు కలిగించడానికి తగిన ఏర్పాట్లను బిజెపి చేసుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేయడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. దాన్ని అమలులో పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా మారాలని చూస్తోంది. ఏపీ బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వెనక్కి నెట్టి తాను ముందుకు రావడం ద్వారా వైసీపీకి తామే ప్రత్యామ్నాయమని ప్రజలకు కలిగించడానికి తగిన ఏర్పాట్లను బిజెపి చేసుకుంటోంది. ఇందుకు అవసరమైతే బిజెపి వలసలను కూడా ప్రోత్సహించే అవకాశం ఉంది. వైసీపీలో చేరలేని టీడీపీ నేతలను, కార్యకర్తలను బిజెపి తన వైపు తిప్పుకోవచ్చు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద పోరాటం చేస్తూ, జగన్ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేస్తూ అది ముందుకు సాగే అవకాశం ఉంది. చంద్రబాబుతో ఇక ఏ మాత్రం బిజెపి పనిచేసే అవకాశం లేదు. చంద్రబాబు తమ పార్టీని దెబ్బ తీశారని సోము వీర్రాజు ఇటీవల స్వయంగా చెప్పారు. అందువల్ల తాము దెబ్బ తినేందుకు సిద్ధంగా లేమని చెప్పడానికి ముందు చంద్రబాబుతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పదలుచుకుంది.
తాము చేసే పోరాటంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తెర ముందుకు తేనుంది. పవన్ కల్యాణ్ ఇమేజ్, తమ వ్యూహరచన కలిసి వస్తుందని బిజెపి భావిస్తోంది. ఒక సామాజిక వర్గాన్ని వైసీపీకి దూరం చేయడం ద్వారా కూడా జగన్ ను బలహీనపరిచే ఆలోచన బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది.
సోము వీర్రాజు వరుసగా మెగాస్టార్ చిరంజీవిని, పవన్ కల్యాణ్ ను కలవడంంలోనూ ముద్రగడ, మాజీ జేడీ లక్ష్మినారాయణను తమ గూటిలోకి తెచ్చుకోవాలనే ఆలోచనలో ఆ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బిజెపి ప్రకటించినా ఆశ్చర్యం లేదు.