చంద్రబాబుకు మరో ముప్పు: అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా గల్లంతు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని తిరుగులేని దెబ్బ తీయాలనే వ్యూహరచనలో బిజెపి ఉంది. తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి పూనుకుంది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని తిరుగులేని దెబ్బ తీయాలనే వ్యూహరచనలో బిజెపి ఉంది. తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి పూనుకుంది.
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష శాసనసభ్యులకు తలుపులు మూసేడయంతో బిజెపికి చక్కని అవకాశం లభించినట్లయింది. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే తప్ప తమ పార్టీలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోబోమని జగన్ ప్రకటించారు. దీన్ని బిజెపి తనకు అనుకూలంగా మలుచుకుంటోంది.
ప్రస్తుతం శాసనసభలో టీడీపికి చంద్రబాబుతో కలిపి 23 మంది శాసనసభ్యులున్నారు. ప్రతిపక్ష హోదాకు సభలోని పది శాతం సభ్యుల బలం అవసరం. అలా చూసినప్పుడు ప్రతిపక్ష హోదా గల్లంతు కాకూడదంటే టీడీపికి 18 శాసనసభ్యుల బలం ఉంటే సరిపోతుంది. ఆరుగురు శాసనసభ్యులు టీడీపిని వీడినా ఆ పార్టీ ప్రతిపక్ష హోదాకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ బిజెపి 16 మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాగే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
రాజ్యసభలోని నలుగురు టీడీపి సభ్యులను తమ వైపు లాగినట్లుగానే ఎపి శాసనసభలోని 16 మంది సభ్యులను తమ వైపు తిప్పుకోవడానికి బిజెపి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యులు అడిగినట్లుగానే వీరు కూడా తమను ప్రత్యేకంగా గుర్తించాలని స్పీకర్ ను కోరే అవకాశం ఉంది. దానివల్ల ఫిరాయింపుల చట్టం నుంచి వారు తప్పించుకోవడానికి వీలవుతుందని అంటున్నారు.
ఫిరాయింపులను నిరోధించే విషయంలో ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కచ్చితంగా ఉన్నారు. పార్టీ ఫిరాయిస్తే వేటు వేస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొద్ది శాసనసభ్యులు బిజెపిలో చేరితే ఎపిలో సమస్య తలెత్తవచ్చునని బిజెపి భావిస్తోంది. అదే సమయంలో జగన్ ను ఇప్పటికిప్పుడు ఇబ్బంది పెట్టే కార్యాచరణకు కూడా దిగకూడదని బిజెపి అనుకుంటోంది. అందువల్ల జగన్ కు చిక్కులు ఎదురు కాకుండా టీడీపీ ఎమ్మెల్యేలను గంపగుత్తగా తమ వైపు లాక్కునేందుకు ఆవసరమైన కార్యాచరణను బిజెపి నేతలు చేపట్టినట్లు తెలుస్తోంది.
పలువురు శాసనసభ్యులు తమవైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని బిజెపి ఆంధ్రప్రదేశ్ నేత విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. అయితే, ఎంత మంది వస్తారనేది ఇప్పుడు చెప్పలేమని, చాలా మంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. ఏమైనా, చంద్రబాబును దెబ్బ తీసి, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనే వ్యూహాన్ని రచించి వేగంగా అమలు చేసే పనిలో బిజెపి ఉన్నట్లు అర్థమవుతోంది.