ముగ్గురు ప్రత్యర్థుల తాకిడి: చంద్రబాబుకు ఇక గడ్డుకాలమే
ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవి చూసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఇక గడ్డుకాలం తప్పకపోవచ్చు. ఆయన ఇప్పుడు ముగ్గురు రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కుని నిలబడాల్సి ఉంటుంది.
విజయవాడ: ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవి చూసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఇక గడ్డుకాలం తప్పకపోవచ్చు. ఆయన ఇప్పుడు ముగ్గురు రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కుని నిలబడాల్సి ఉంటుంది. చంద్రబాబు అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన ప్రత్యర్థులు విజయం సాధించారు.
వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి పీఠం అధిష్టించబోతున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉండనే ఉన్నారు. ఈ ముగ్గురు కూడా చంద్రబాబుకు బలమైన ప్రత్యర్థులే.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఆ ముగ్గురు నాయకులను లక్ష్యం చేసుకుని పోరాటం సాగించారు. ఆ ముగ్గురు కుమ్మక్కయి, టీడీపీని దెబ్బ తీయాలని చూస్తున్నారని, వారి ఆటలు సాగవని ఆయన ఎన్నిసార్లు అని ఉంటారో చెప్పలేం.
చంద్రబాబుపై ఉన్న పాత కేసులను తవ్వి తీయడానికి మోడీ, కేసీఆర్, వైఎస్ జగన్ ప్రయత్నిస్తారనే మాట రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతిపై జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.
కేంద్రంలో మోడీని అడ్డుకోవాలని చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే, ఆయన అంచనాలను మించుతూ బిజెపి మెజారిటీ సాధించడంతో ఆయన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. ఎన్నికల కమిషన్ పై యుద్ధాన్నే ప్రకటించారు ఈసీ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సిఈవో ద్వివేదీపై విరుచుకుపడ్డారు. ఈ స్థితిలో ఆయనకు పలువురు అధికారులు దూరమయ్యారు.