గ్రామాల్లో పాలనా సంస్కరణలకు పవన్ శ్రీకారం ... గేమ్ చేంజింగ్ నిర్ణయాలు
ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామాల్లో పాలనా స్వరూపాన్ని మారుస్తూ పంచాయితీరాజ్ శాఖమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది గ్రామీణప్రాంతాల రూపరేఖలను మార్చే గేమ్ చేంజర్ అవుతుందేమో చూడాలి.

Pawan Kalyan
Pawan Kalyan : జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం దిశగా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిసరఫరా, అటవీ, సైన్స్ ఆండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను పవన్ చూస్తున్న విషయం తెలిసిందే. ఈ శాఖల మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సరికొత్తగా వుంటున్నాయి... ప్రజల మెప్పును పొందుతున్నాయి.
తాజాగా పవన్ కల్యాణ్ గ్రామాల్లో పాలనను గాడిలోపెట్టేందకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఏ గ్రామంలోనూ సిబ్బంది కొరత లేకుండా చూడాలని పంచాయితీరాజ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థలో మార్పులు సూచించారు. గ్రామ పంచాయితీ గ్రేడ్ల ఏర్పాటుకు కొత్త ఫార్ములాను ప్రతిపాదించారు పవన్... దీని ఆధారంగా సిబ్బంది కేటాయింపు, పంచాయతీ, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకోవాలని పవన్ సూచించారు.
Pawan Kalyan
గ్రామీణ పాలనలో ఇక పవన్ రూల్స్ :
ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆ శాఖ ఉన్నతాధికారులతో ఇవాళ(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల క్లస్టర్ గ్రేడ్ల విభజనపై చర్చించారు. ఈ సందర్భంగా పాత పద్దతిలో కాకుండా జనాభాను దృష్టిలో పెట్టుకుని ఈ గ్రామీణ ప్రాంతాలను విడదీయాలని మంత్రి పవన్ సూచించారు.
గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. ఇలా జరగాలంటే సిబ్బంది కొరత వుండకూడదు...దీన్ని అధిగమించాలంటే క్లస్టర్ విధానంలో మార్పులు తప్పవన్నారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు పవన్.
గతంలో పంచాయతీల ఆదాయమే ప్రాతిపదికగా చేపట్టిన క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానానికి మరికొన్నింటిని జోడించాలని సూచించారు. జనాభాను కూడా ప్రాతిపదికగా తీసుకొని పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు విభజించాలని పవన్ సూచించారు. సిబ్బంది నియామకం విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా ప్రతి గ్రామ పంచాయతీలో సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చూడాలన్నారు.
Pawan kalyan
గ్రామాల్లో పాలన ఎలా వుండనుందంటే...
ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా తక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభాగా ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో పాత క్లస్టర్ వ్యవస్థ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సిబ్బంది నియామకం విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులపై తాజా సమీక్షలో పవన్ అధికారులతో చర్చించారు.
గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకొని కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బందిని నియమించుకోవడంపై పవన్ చర్చించారు. ఈ విధంగా చేయడం వల్ల మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాలు అమలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. ఇక గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యత అయిన తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగుదలకు తగినంత మంది సిబ్బంది ఉంటారని పవన్ పేర్కొన్నారు.
కొత్త క్లస్లర్ వ్యవస్థపై అధ్యయనం చేసి పంచాయతీల్లో పరిపాలన సులభతరం చేసేందుకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కమిటీ వేయాలని మంత్రి పవన్ నిర్ణయించారు. కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫార్సులు చేయనుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి నలుగురు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు పవన్ స్పష్టం చేసారు.
జిల్లా యూనిట్ ప్రాతిపదికన 26 జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకొని ఈ కమిటీ నివేదిక రూపొందిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలను రాష్ట్ర కమిటీ పరిశీలించిన తర్వాత పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లను ప్రభుత్వానికి నివేదిస్తుంది. గ్రేడ్ల ఆధారంగా పంచాయతీ, సచివాలయ సిబ్బందిని పంపిణీ చేయడానికి మార్గదర్శకాలను రూపొందిస్తారని పవన్ స్పష్టం చేసారు.