జగన్ వెన్నెముక విజయసాయి: వైఎస్ కు కేవిపి లాగే...
ఇంత అద్భుతమైన విజయానికి కారణమేమిటని అడిగితే బహుశా, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణాలు చెప్తారు. ఒక్కటి తన పాదయాత్ర, రెండోది విజయసాయి రెడ్డి కృషి. జగన్ పక్కన విజయసాయి రెడ్డి ఓ పిల్లర్ లా నిలబడ్డారు.
అమరావతి: ఇంత అద్భుతమైన విజయానికి కారణమేమిటని అడిగితే బహుశా, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణాలు చెప్తారు. ఒక్కటి తన పాదయాత్ర, రెండోది విజయసాయి రెడ్డి కృషి. జగన్ పక్కన విజయసాయి రెడ్డి ఓ పిల్లర్ లా నిలబడ్డారు. మంచి సమయాల్లోనే కాదు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా జగన్ వెంట ఆయన నిలిచారు. అందుకే తన విజయంలో విజయసాయి రెడ్డికి తగిన క్రెడిట్ జగన్ ఇస్తారని పార్టీ నాయకులు అంటున్నారు.
తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కెవిపి రామచంద్ర రావు ఓ ఆత్మలాగా పనిచేశారో, జగన్ కు విజయసాయి రెడ్డి అలా పనిచేశారని అంటారు. వైఎస్సార్ కాంగ్రెసులో విజయసాయి రెడ్డి కీలకమైన వ్యూహకర్తగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైన సూత్రధారిగా విజయ సాయిరెడ్డిని చెప్పుకోవచ్చు..
పార్టీలో ప్రస్తుతం జగన్ తర్వాతి స్థానం విజయసాయి రెడ్డిదే. అంతే కాకుండా జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడు కూడా. దాంతో పాలనలో కూడా ఆయన కీలకంగా వ్యవహరిస్తారనే మాట వినిపిస్తోంది. పార్టీ విజయంలో జగన్ పక్కన నిలబడిన విజయసాయి రెడ్డి ఆస్తుల కేసులో జగన్ తో పాటు జైలుకు కూడా వెళ్లారు.
విజయసాయిరెడ్డిలో నిస్పృహ గానీ ఆగ్రహం గానీ మచ్చుకైనా కనిపించదు. జగన్ నుంచి ఆయన డిమాండ్ చేసింది కూడా ఏమీ లేదు. పార్టీ కోసం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ వ్యూహాలు రచించింది ఆయనే. రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో ఉండి ఆయన పలువురు మంత్రులతో సాన్నిహిత్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సాన్నిహిత్యంతో ప్రత్యేక హోదాపై కూడా వారితో విజయసాయి రెడ్డి చర్చిస్తారని అంటున్నారు
వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో కూడా జగన్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో విజయసాయి రెడ్డి కీలకమైన భూమిక పోషించారు. వైఎస్ మరణం తర్వాత విజయసాయి రెడ్డి జగన్ కు మరింత దగ్గరయ్యారు. ఓ కుటుంబ సభ్యుడిలా మారిపోయారు.
ఆస్తుల కేసులు వచ్చినప్పుడు ఇద్దరం కలిసి న్యాయపోరాటం చేద్దామని జగన్ కు భరోసా ఇచ్చింది కూడా విజయసాయి రెడ్డే. సాక్షి గ్రూప్, ఇతర వ్యాపారాల ఆర్థిక సలహాదారుగా కూడా విజయసాయి రెడ్డి పనిచేస్తున్నారు 2012 జనవరి 2వ తేదీన ఆయన అరెస్టయ్యారు. 2013 అక్టోబర్ 8వ తేదీన సిబిఐ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
తన అరెస్టు తప్పదని భావించిన వెంటనే విజయసాయి రెడ్డి యోగా, ధ్యానం చేయడం ప్రారంభించారని చెబుతారు. జైలు పరిస్థితులకు అనుకూలంగా మనసును నియంత్రించడానికి ఆయన ఆ పనిచేశారని అంటారు.
నెల్లూరు జిల్లాలోని తాళ్లపూడిలో జన్మించిన విజయ సాయి రెడ్డి చెన్నైలో చార్టర్డ్ అకౌంటెన్సీ చేశారు. ఆ తర్వాత చెన్నై, బెంగళూరు, హైదరాబాదుల్లో కార్యాలయాలు ప్రారంభించారు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు.