నూతన సమాచార కమీషనర్లుగా హరిప్రసాద్ రెడ్డి, చెన్నారెడ్డి... ప్రమాణం చేయించిన సీఎస్
అమరావతిలోని సచివాలయంలోని సీఎం సమావేశ మందిరంలో ఆర్టీఐ నూతన కమీషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమాచార కమీషన్ నూతన కమీషనర్లుగా ఉల్చల హరిప్రసాద్ రెడ్డి, కాకర్ల చెన్నారెడ్డిలు నియమితులయ్యారు. వారిచేత ఇవాళ(శుక్రవారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ప్రమాణం చేయించారు.
అమరావతిలోని సచివాలయంలోని సీఎం సమావేశ మందిరంలో ఆర్టీఐ నూతన కమీషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రమాణస్వీకారం అనంతరం నూతన కమీషనర్లకు అధికారులు పుష్ఫ గుచ్చాలు అందించి శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ... ఏపీలో సమాచార హక్కు చట్టంను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నూతన కమీషనర్లు తమవంతు పాత్ర పోషించాలన్నారు. ఈ చట్టంపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచేలా పనిచేయాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు ఒక వరం వంటిదని... దాన్ని తమ సమస్యలను పరిష్కరించుకోడానికి ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పించాలన్నారు సీఎస్.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్, రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ పి.రమేశ్ కుమార్, ఇన్ఫర్మేషన్ కమీషనర్లు బివి రమణ కుమార్, కట్టా జనార్దనరావు, ఆర్.శ్రీనివాసరావు, ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.