రోజాకి షాక్: వైరి వర్గానికి కార్పోరేషన్ పదవి, ఏం జరుగుతోంది?
చిత్తూరులోని వైసీపీ రాజకీయాాల్లో కలకలం రేపింది.నగరి నియోజకవర్గంలోని కేజే కుమార్ కు కార్పోరేషన్ పదవి ఇవ్వడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.
: ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజాకు తలనొప్పి నెలకొంది. నగరి నియోజకవర్గంలోని తన వ్యతిరేక వర్గీయులకు కార్పోరేషన్ పదవి దక్కడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. నగరి మాజీ మున్సిపల్ ఛైర్మెన్ కేజే కుమార్ కు ఈడిగ కార్పోరేషన్ పదవి దక్కడం చిత్తూరు రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
చిత్తూరు జిల్లాలోని నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రోజా రెండు దఫాలు వరుసగా విజయం సాధించారు. ఈ నియోజకర్గంలోని మాజీ మున్సిపల్ ఛైర్మెన్ కేజే కుమార్ వర్గంతో రోజాకు పొసగడం లేదు.
గతంలో కేజేకుమార్ ఇంట్లో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడ హాజరుకావొద్దని రోజా కోరారు. ఈ మేరకు ఆమె అప్పట్లో పార్టీ కార్యకర్తలకు పంపిన ఆడియో సందేశం వైసీపీలో కలకలం రేపింది.
పార్టీ నేతలను ఎవరూ కూడ హాజరుకావొద్దని రోజా ఆదేశించినా.... ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకావడం చర్చకు దారితీసింది. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు హాజరయ్యారు.
ఈ ఏడాది మే మాసంలో పుత్తూరులో కళ్యాణ మండపం నిర్మాణం కోసం డిప్యూటీ సీఎం నారాయణస్వామి అధికారులతో స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థల పరిశీలన కోసం వచ్చిన సమయంలో కనీసం తనకు సమాచారం ఇవ్వకపోవడంపై రోజా అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేజేకుమార్ కు రాష్ట్ర ఈడిగ కార్పోరేషన్ పదవి రావడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో కేజే కుమార్ కు ఈ పదవి దక్కిందనే ప్రచారం నగరిలో సాగుతోంది.ఈ పదవి రావడంతో కేజే కుమార్ వర్గీయులు నగరిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. కేజే కుమార్కి పదవి దక్కడం రోజా వర్గీయుల్లో అసంతృప్తి నెలకొంది.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఈ ఏడాది రాఖీపౌర్ణమి సందర్భంగా రోజా రాఖీ కట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో ఉన్న దూరాన్ని తగ్గించుకొనేందుకు గాను ఆమె రాఖీ కట్టినట్టుగా అప్పట్లో చర్చ సాగింది.
ఈ పరిణామంతో రెండు కుటుంబాల మధ్య అగాధం తగ్గే అవకాశం ఉందని భావించారు. కానీ కేజే కుమార్ కి కార్పోరేషన్ పదవి దక్కడం మాత్రం ప్రస్తుతం రోజా వర్గీయులకు షాక్ ను గురిచేసింది.
నగరి నియోజకవర్గంలోని వైసీపీలో ఏం జరుగుతోందనే చర్చ సర్వత్రా నెలకొంది. రోజాకు గిట్టని కేజే కుమార్ కు కీలకమైన పదవిని కట్టబెట్టడంపై జిల్లా రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ఈ విషయమై రోజా ఇంకా నోరు మెదపలేదు.