పోలీసుల సమక్షంలోనే... చిన్నారితో వెట్టిచాకిరీ హృదయాన్ని కలచివేసింది: డిజిపి సీరియస్
ఆత్మకూరులో చిన్నారి చేత పోలీసుల సమక్షంలోనే వెట్టిచాకిరి చేయించిన ఘటన ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్ స్పందించారు.
అమరావతి: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ జరుగుతున్న కళాశాలలో ఓ చిన్నారి చేత వెట్టిచాకిరి చేయించడం వివాదాస్పదంగా మారింది. ముక్కుపచ్చలారని చిన్నారి చేత కళాశాల సిబ్బంది ఓ గదిని శుభ్రం చేయించారు. అయితే ఇలా చిన్నారుల చేత వెట్టిచాకిరి చేయించడం లాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన పోలీసులే దగ్గరుండి మరీ చేయించడం మరింత వివాదాస్పదంగా మారింది.
ఈ విషయం మీడియాలో కథనాలు రావడంతో ఉన్నతాధికారులు రియాక్ట్ అవుతున్నారు. చిన్నారి గదిని శుభ్రం చేస్తున్న దృశ్యాలు తన హృదయాన్ని కలచి వేశాయంటూ ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. చిన్నారి తల్లి తన పనిని కూతురు చేత చేయించిందని తెలుస్తోందని... ఇలా చేయడం కూడా చట్ట రిత్యా నేరమేనని అన్నారు. ఇలాంటి ఘటనలను అడ్డుకోవాల్సిన కానిస్టేబుల్ ప్రేక్షక పాత్ర వహించినట్లు వీడియోను బట్టి తెలుస్తోందని... అతడిపై శాఖ పరమైన చర్యలకు నెల్లూరు ఎస్పీకి ఆదేశించామన్నారు.
ఆపరేషన్ ముస్కాన్ పేరుతో అనేక మంది బాలబాలికలకు ఓ పక్క వెట్టిచాకిరి నుండి విముక్తి కల్పిస్తుంటే..మరో పక్క పోలీస్ సమక్షంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. కళాశాల యాజమన్యం పైనా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డిజిపి ఆదేశించారు.
ఈ ఘటన ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై విచారణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ స్థానిక సీఐను విచారణను ప్రారంభించారు.
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్దం చేశారు. ఈ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియకు ఇద్దరు కానిస్టేబుళ్లను బందోబస్తుగా నియమించారు. అయితే పోలీసులకు కేటాయించిన గదిలో దుమ్ముతో నిండిపోయింది. ఈ గదిని క్లీన్ చేయాలని అక్కడ వాచ్ మెన్ గా పనిచేసే వ్యక్తి భార్యకు చెప్పారు. అయితే ఆమె అనారోగ్యంతో వుండటంతో ఏడేళ్ల చిన్నారితో ఈ గదిని క్లీన్ చేయించారు.