రాజకీయాలకు, బిజీ షెడ్యూల్కు విరామం.. సరదాగా క్రికెట్ ఆడిన వైఎస్ జగన్ (ఫోటోలు)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనలో బిజిబిజిగా వుంటున్నారు. ఉదయం బద్వేలు, మధ్యాహ్నం కడపలలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇదే సమయంలో రాజారాడ్డి స్టేడియంలో సీఎం సరదాగా క్రికెట్ ఆడారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే, ఆయన బయట కనిపించేది తక్కువే. ఎప్పుడూ ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు, ప్రజా సంబంధ విషయాలతో తలమునకలై ఉంటారు.
అయితే, ఇవాళ కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో సరదాగా క్రికెట్ ఆడారు. ఈ నూతన స్టేడియంలో సీఎం జగన్ ఇవాళ ఫ్లడ్ లైట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బ్యాట్ పట్టిన సీఎం జగన్ సరదాగా క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సీఎం జగన్ కు క్రికెట్ లో నైపుణ్యం ఉన్నట్టు వీడియో చెబుతోంది.
ప్రొఫెషనల్ ఆటగాడిలా బ్యాటింగ్ స్టాన్స్ కానీ, గ్రిప్ కానీ, ఆయన బంతులను లెగ్ సైడ్ తరలించిన విధానం కానీ ఆకట్టుకునేలా వున్నాయి. సీఎం పక్కా క్రికెటింగ్ షాట్లు ప్రదర్శించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.