ఏపీలో టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టం... దేవాలయాల్లోనూ ఆన్లైన్ పేమెంట్
క్యాంప్ కార్యాలయంలో టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను సీఎం జగన్ ప్రారంభించారు.
ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ పరిధిలోని అన్ని దేవాలయాలను టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టంలోకి తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. దేవాలయాల సమాచారం, ఆన్లైన్ సర్వీసులు, యాత్రికులకు అవసరమైన సేవలు, దేవాలయాల ప్రొఫైల్స్, ఆస్తుల నిర్వహణ, క్యాలెండర్, సేవలు, పర్వదినాల నిర్వహణ, ఆదాయం, ఖర్చుల వివరాలు, డాష్బోర్డు, సిబ్బంది వివరాలు ఇవన్నీ కూడా టెంపుల్ మేనేజ్ మెంట్ వ్యవస్థలో ఉంటాయన్నారు.
క్యాంప్ కార్యాలయంలో టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ వ్యవస్థ ద్వారా భక్తులు ఇ–హుండీ ద్వారా కానుకలు సమర్పించే అవకాశం కల్పించారు. అలాగే క్యూ–ఆర్ కోడ్ ద్వారా ఇ–హుండీకి కానుకలు సమర్పించే అవకాశం కల్పించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ నిర్వహించనుంది. తొలిసారి అన్నవరం దేవాలయంలో ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.
ఈ నెలాఖరు నాటికి 11 ప్రధాన దేవాలయాలల్లో ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అన్నవరం టెంపుల్కు 10,116లు ఇ–హుండీ ద్వారా సమర్పించింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని సీఎం జగన్ అన్నారు. దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాలని భావించే ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్, ఎండోమెంట్ కమిషనర్ అర్జున రావు, యునియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి అండ్ సిఈఓ రాజ్ కిరణ్ రాయ్ జి, ఎస్ఎల్బిసి కన్వీనర్ వి.బ్రహ్మనందరెడ్డి, ఎస్ఎల్బిసి ఏజీఎం అండ్ కోఆర్డినేటర్ ఇ.రాజుబాబు, రీజనల్ హెడ్ వి రమేష్ తదితరులు పాల్గొన్నారు.