చంద్రబాబు అమరావతి తప్పులు: విశాఖ పై వైఎస్ జగన్ అప్రమత్తం
జగన్ ఇప్పుడు నూతన రాజధాని విశాఖలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పును రిపీట్ చేయదల్చుకోలేదు. జగన్ ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నట్టుగా అర్థమవుతుంది.
అమరావతి విషయంలో జగన్ సర్కార్ తన పంతం నెగ్గించుకుంది. అమరావతి బదులుగా రాష్ట్రంలో వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. అమరావతి రైతులు తమకు అన్యాయం జరుగుతుందని ఒక పక్క గగ్గోలు పెడుతున్నప్పటికీ... జగన్ మాత్రం ఈ విషయంలో ముందుకు దూసుకుపోతున్నాడు.
జగన్ ఇప్పుడు నూతన రాజధాని విశాఖలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పును రిపీట్ చేయదల్చుకోలేదు. జగన్ ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎక్కడా మాట రాకుండా, ఆరోపణలకు తావు లేకుండా జగన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
అమరావతి విషయంలో చంద్రబాబు భారీ స్థాయిలో ప్రణాళికలను రచించాడు. 33 వేల ఎకరాలు సేకరించాడు. భారీ నిర్మాణాలకు రూపకల్పనలు చేసాడు. సింగపూర్ ను తలదన్నే రాజధాని నిర్మిస్తానని అన్నాడు. పంచ వర్ష ప్రణాళికలకు బదులుగా దీర్ఘ కాలికంగా 10, 20 సంవత్సరాల ప్రణాళికలను రచించారు.
అంతే కాకుండా ఆయన నిర్మాణాలను అన్నిటిని ఒకేసారి మొదలుపెట్టే సరికి ఏ ఒక్క నిర్మాణం కూడా పూర్తిగా పూర్తి కాలేదు. అన్ని కూడా పూర్తి కాకుండా అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. చంద్రబాబు ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేకపోయిన కారణంగా అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న జగన్ నేరుగా అమరావతిని భ్రమరావతి అని కూడా అన్నారు.
చంద్రబాబు చేసిన ఆ చిన్న తప్పు వల్లనే జగన్ అంత తేలికగా మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకోగలిగాడు. ప్రజా వ్యతిరేకత మొదలై ఉంటే జగన్ ఆ సాహసం చేసి ఉండేవాడు కాదు.
అమరావతిలో ఏం నిర్మించారు, ఏమి నిర్మించలేదు అన్ని గ్రాఫిక్స్ అని వైసీపీ అంటుంటే చూపెట్టుకోవడానికి టీడీపీ వద్ద ఒక్క బ్రహ్మాండమైన భవంతి కూడా లేదు. అసలు భావంతులేవీ పూర్తి స్థాయిలో నిర్మాణం అవలేదు.
తాత్కాలిక నిర్మాణాలను మాత్రమే చేపట్టారు. అంతే తప్ప పూర్తిస్థాయి చిహ్నాలుగా మిగిలిపోయే విధంగా ఏ నిర్మాణాన్ని చేపట్టాక పోవడంలో విఫలం చెందబట్టే జగన్ సర్కార్ ఆరోపణలు చేయగలిగింది.
33 వేల ఎకరాలను సేకరించారు. డబ్బును ఖర్చు చేసారు. అయినప్పటికీ 5 సంవత్సరాల్లో ఎటువంటి నిర్మాణం పూర్తి కాకపోవడంతో డబ్బులన్నీ ఇక్కడ వృధాగా పోయాయి అని అనిపించడంతోపాటుగా..... అవినీతి ఆరోపణలకు కూడా బలం చేకూరింది.
ఈ పరిస్థితులన్నింటిని పరిశీలించిన జగన్ తాను భారీ స్థాయిలో విశాఖలో ఏర్పాట్లు చేయదల్చుకోలేదని తెలియవస్తుంది. ఇప్పటికే అక్కడ నిర్మాణమయి ఉన్న ప్రభుత్వ భవనాలను వాడుకోవాలని చూస్తున్నారు.
అవసరమైతే ఇతరాత్ర కార్యాలయాలను తరలించేందుకు అనువుగా భవనాలను అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నారు. అత్యవసరమైన ఒకటి రెండు నిర్మాణాలను మాత్రమే చేపట్టాలని జగన్ భావిస్తున్నారు.
నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల, రాజధాని ఏర్పాటుకోసం ఎటువంటి అదనపు ఖర్చు కావడం లేదు అని చూపెట్టడం ఒకెత్తయితే... చంద్రబాబు మాదిరి జగన్ అనవసరపు ఖర్చులు చేయడంలేదని, చాలా సింపుల్ అనే పేరును కూడా మిగుల్చుకోగలుగుతారు.
అమరావతి తరలింపు వల్ల భారీ ఖర్చు మీద పడుతుందనే ప్రశ్న కూడా ఈ విధంగా తలెత్తకుండా ఉంటుంది కూడా. రాజధాని తరలింపు వల్ల ప్రజా ధనం దుర్వినియోగమవుతుందని, కొత్త రాజధాని నిర్మాణం వల్ల ఖర్చు అధికమవుతుందని, వృధా ఖర్చు వలన నష్టమే తప్ప లాభం లేదు అనే ప్రశ్నకి ప్రభుత్వం సమాధానం చెప్పినట్టవుతుంది. ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో ఒక మినిమలిస్టిక్ రాజధాని ఏర్పాటువైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది.