AP Cabinet: ఉచితంగా కార్పొరేట్ విద్య.. ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్ల ఏర్పాటు
AP Cabinet: ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధి, విద్య, పర్యాటకం, తాగునీటి సదుపాయాలు, రాజధాని అభివృద్ధి వంటి కీలక రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం జరిగింది.

పేద విద్యార్థులకు ఉచిత IIT, JEE, NEET రెసిడెన్షియల్ కోచింగ్
సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖపట్నం, నెల్లూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
ఈ కేంద్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు IIT-JEE, NEET ప్రవేశ పరీక్షలకు పూర్తిగా ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించనున్నారు. ఆధునిక తరగతి గదులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, వసతి, భోజన సౌకర్యాలతో గురుకుల విద్యాసంస్థలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనుంది.
రూ.11,569 కోట్ల పెట్టుబడులు.. 31 వేలకుపైగా ఉద్యోగాలు
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వాలనే లక్ష్యంతో మొత్తం 13 భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా సుమారు రూ.11,569.91 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానుండగా, దాదాపు 31,431 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
చిత్తూరు జిల్లాలో మోండెలీజ్ ఇండియా ఫుడ్స్ సంస్థ రూ.1,801 కోట్లతో భారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు టెక్నాలజీ అప్గ్రేడేషన్, విద్యుత్ సబ్సిడీ వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోకో ఆధారిత చాక్లెట్ తయారీలో ఆంధ్రప్రదేశ్ను దేశంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది. అదేవిధంగా వ్యర్థ నూనెతో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీ ప్రాజెక్టుకు కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేసింది.
పర్యాటకం, తాగునీటి ప్రాజెక్టులకు భారీ ప్రాధాన్యం
రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా టూరిజం పాలసీలో కీలక మార్పులు చేశారు. భారీ సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) అందించాలని నిర్ణయించారు. 20 వేల మంది వరకు హాజరయ్యే ఈవెంట్లకు రూ.2 కోట్ల వరకు, 50 వేల మంది వరకు పాల్గొనే కార్యక్రమాలకు రూ.5 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అవసరమైతే ప్రభుత్వ స్థలాలను కూడా ఉచితంగా కేటాయించేందుకు సిద్ధమైంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.9,355 కోట్లతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్కు ఆమోదం తెలిపింది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో రూ.1,811 కోట్లతో 2,943 తాగునీటి పథకాలు అమలు చేయనుంది.
అమరావతి రైతులకు ఊరట..
రెండో విడత భూసమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు పలు రాయితీలు ప్రకటించింది. 2026 జనవరి 6కు ముందు తీసుకున్న సాగు రుణాల్లో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ వర్తించనుంది. అలాగే భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు పెంపునకు కూడా ఆమోదం తెలిపింది. మెట్ట భూములకు ఏడాదికి రూ.40 వేల వరకు, జరీబు భూములకు రూ.60 వేల వరకు కౌలు చెల్లించనున్నారు. పర్యాటక రంగంలో భాగంగా నెల్లూరులో ITC హోటల్, కడపలో మాధవి హోటల్, విజయవాడలో సరోవర్ పోర్టికో హోటల్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నారు. కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతి జిల్లాలో లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సోషల్ మీడియా దుష్ప్రచారంపై ప్రత్యేక టాస్క్ఫోర్స్
కేబినెట్ సమావేశంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం, అభ్యంతరకర పోస్టులపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. ప్రభుత్వంపై అసత్య ప్రచారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవడంతో పాటు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించాలని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా పటిష్టమైన వ్యవస్థను రూపొందించాలని, అదే సమయంలో భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అదనంగా విశాఖపట్నంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు మరింత స్పష్టమైన సమాచారం అందేలా మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

