కారణమిదీ: గర్భిణీని 10 కి.మీ. డోలీలో మోసుకెళ్లిన భర్త
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు దాటినా కూడ ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
: విజయనగరం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీలను గిరిజనులు ఆశ్రయిస్తున్నారు. ఏళ్ల తరబడి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.
పాలకులు మారినా గిరిజనుల జీవితాల్లో పరిస్థితులు మారలేదు.విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట మండలం పొర్ల గ్రామానికి చెందిన గర్భిణీ చంద్రమ్మ నిండు గర్భిణీ.ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. ఆమెను ఆసుపత్రికి తరలించాలంటే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఈ గ్రామానికి వాహనాలు వచ్చే పరిస్థితి లేదు.
మండలంలోని డబ్బాగుంట వరకు డోలిలోని చంద్రమ్మను భర్త మోసుకెళ్లాడు. తమ గ్రామం నుండి డబ్బాగుంటకు 10 కి.మీ. దూరం ఉంటుంది. డబ్బాగుంట నుండి శృంగవరపుకోటకు రహదారి సౌకర్యం ఉంటుంది.
డబ్బాగుంట వరకు అంబులెన్స్ సౌకర్యం ఉండడంతో డోలీలో భార్యను మోసుకొచ్చిన భర్త అక్కడి నుండి అంబులెన్స్ లో ఆమెను శృంగవరపుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
గతంలో డోలీలో ఆసుపత్రికి తరలించే సమయంలో మరణించిన ఘటనలు కూడ ఉన్నాయి. డోలీలో ఆసుపత్రికి నడుచుకొంటూ తీసుకెళ్లడంతో ఆసుపత్రికి వెళ్లిన కొద్దిసేపటికి కూడ మరణించిన ఉదంతాలు కూడ లేకపోలేదు.