- Home
- Andhra Pradesh
- 300 ఎకరాల్లో, రూ. 8,175 కోట్ల పెట్టుబడి.. ఆంధ్రప్రదేశ్లోని ఈ గ్రామం రూపు రేఖలు మారడం ఖాయం
300 ఎకరాల్లో, రూ. 8,175 కోట్ల పెట్టుబడి.. ఆంధ్రప్రదేశ్లోని ఈ గ్రామం రూపు రేఖలు మారడం ఖాయం
Andhra pradesh: ఏపీలో పరిశ్రమల వృద్ధికి మరో కీలక అడుగు పడింది. విద్యుత్ స్టోరేజ్ టెక్నాలజీలో ముఖ్యమైన లిథియం అయాన్ బ్యాటరీల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు భారీ పెట్టుబడి ముందుకు వచ్చింది. ఇంతకీ ప్రాజెక్టు ఎక్కడ రానుందంటే.?

ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు.?
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఈ భారీ పరిశ్రమ స్థాపనకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 300 ఎకరాల భూమిని కేటాయించింది. సముద్రానికి దగ్గరగా ఉండటం, పోర్ట్ సౌకర్యాలు అందుబాటులో ఉండటం వంటి కారణాలతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇది భవిష్యత్తులో ఎగుమతులకు కూడా అనుకూలంగా మారనుంది.
పెట్టుబడి, సామర్థ్యం ఎంత?
ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.8,175 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ప్రారంభ దశలోనే 16 గిగావాట్ అవర్ సామర్థ్యంతో లిథియం అయాన్ సెల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో దీనిని విస్తరించి 20 గిగావాట్ అవర్ సామర్థ్యానికి పెంచే ప్రణాళిక కూడా ఉంది. అదే స్థాయిలో బ్యాటరీ ప్యాక్తో పాటు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ఫ్యాక్టరీలో ఏం తయారు చేస్తారంటే.?
ఈ యూనిట్లో మూడు ప్రధాన విభాగాలు ఒకేచోట ఉండడం విశేషం. లిథియం అయాన్ సెల్స్ తయారీ, బ్యాటరీ ప్యాక్స్ అసెంబ్లీ, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్. ఇది కేవలం బ్యాటరీ ఫ్యాక్టరీ కాదు, పూర్తి స్థాయి ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. దేశంలో ఈ తరహా సమగ్ర వ్యవస్థలు చాలా అరుదు. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టడం దీని మరో ముఖ్యాంశం.
లభించనున్న ఉద్యోగాలు.
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి కంపెనీల్లో ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్), టెక్నీషియన్లు, ఆపరేటర్లు, క్వాలిటీ కంట్రోల్, రీసెర్చ్ విభాగం, మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, సపోర్ట్ సర్వీసులు వంటి ఉద్యోగవకాశాలు లభిస్తాయి.
భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందుతుంది?
ఈ పరిశ్రమ రాకతో అనకాపల్లి ప్రాంతం ఎనర్జీ హబ్గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు బలమైన మద్ధతు, సోలార్, విండ్ పవర్తో బ్యాటరీ స్టోరేజ్ అనుసంధానం, ఎగుమతుల పెరుగుదల చిన్న, మధ్య తరహా అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ఇప్పటికే ఈ సంస్థ అంతర్జాతీయ మార్కెట్లో అనుభవం కలిగి ఉండటం వల్ల, ఈ ప్రాజెక్టు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది.
ఎప్పుడు పూర్తి కానుంది.?
ప్రాజెక్టు మొదటి దశను 2027 జులై నాటికి పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తరువాత దశలవారీగా విస్తరణ చేపట్టనున్నారు. ఈ పరిశ్రమతో ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ రంగంలో కీలక కేంద్రంగా ఎదగనుంది. పరిశ్రమలు, ఐటీ, గ్రీన్ ఎనర్జీ అన్నీ కలిపి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ చూపించే ప్రాజెక్టుగా ఇది నిలవనుంది.

