- Home
- Andhra Pradesh
- రూ. 1.3 లక్షల కోట్లతో నిర్మాణం, ఈనెల 28న శంకుస్థాపన.. ఏపీలో ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
రూ. 1.3 లక్షల కోట్లతో నిర్మాణం, ఈనెల 28న శంకుస్థాపన.. ఏపీలో ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త అధ్యాయనానికి శ్రీకారం పడనుంది. విశాఖపట్నంలో గూగుల్ నిర్మించనున్న మెగా డేటా సెంటర్ ప్రాజెక్టుకు ఈ నెల 28వ తేదీన శంకుస్థాపన జరగనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారీ పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగ అభివృద్ధిలో కీలక మలుపుగా భావిస్తున్న గూగుల్ మెగా డేటా సెంటర్ ప్రాజెక్టు విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 28న ఈ ప్రాజెక్టుకు అధికారికంగా శంకుస్థాపన జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థ భాగస్వామ్యంతో చేపట్టే ఈ భారీ ప్రాజెక్టుకు సుమారు 15 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి రానుంది. భారత కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 1.3 లక్షల కోట్లు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ పాల్గొననున్నారు. ఆసియాలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా సెంటర్లలో ఇదొకటిగా భావిస్తున్నారు.
విశాఖలో మెగా డేటా సెంటర్ ప్రాజెక్టు రూపకల్పన
విశాఖ సమీపంలోని మూడు ప్రాంతాల్లో ఈ మెగా డేటా సెంటర్కు అవసరమైన భూమిని ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 601.4 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు అభివృద్ధి చెందనుంది. ఇందులో తొలి దశగా తర్లువాడ ప్రాంతంలో ప్రధాన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్టు కోసం తర్లువాడలో 266 ఎకరాలు, రాంబిల్లి (అనకాపల్లి జిల్లా)లో 174 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు కేటాయించారు. తర్లువాడలో ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. అక్కడి భూమిని చదును చేసి నిర్మాణానికి సిద్ధం చేశారు. ప్రాజెక్టు కోసం అవసరమైన రహదారుల నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు.
గూగుల్ భాగస్వామ్య సంస్థలు, మౌలిక సదుపాయాల ప్రణాళిక
ఈ ప్రాజెక్టు అమలులో గూగుల్కు అనుబంధ సంస్థలు కూడా భాగస్వామ్యంగా పనిచేస్తున్నాయి. డేటా సెంటర్ అభివృద్ధి కార్యక్రమాన్ని రైడెన్ ఇన్ఫోటెక్ సంస్థ సమన్వయం చేస్తోంది. మౌలిక సదుపాయాల ఏర్పాటులో అదానీ ఇన్ఫ్రా కీలక భాగస్వామిగా ఉంటుంది. డేటా సెంటర్ నిర్మాణం సుమారు 1.43 లక్షల చదరపు మీటర్ల బిల్ట్అప్ ఏరియాలో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. పార్కింగ్ కోసం సుమారు 33 శాతం స్థలం కేటాయిస్తుండగా, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా దాదాపు 59.91 ఎకరాలను గ్రీన్ బెల్ట్గా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం ఇప్పటికే గూగుల్ సంస్థ దరఖాస్తు చేసింది.
విశాఖను ఐటీ, ఏఐ హబ్గా మార్చే ప్రాజెక్టు
విశాఖలో ఏర్పాటు కానున్న ఈ మెగా డేటా సెంటర్ ద్వారా నగరం భవిష్యత్తులో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ హబ్గా ఎదగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గూగుల్ క్లౌడ్ సేవలకు అవసరమైన పెద్ద స్థాయి డేటా ప్రాసెసింగ్ ఇక్కడే జరుగనుంది. దీంతో దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు కూడా విశాఖ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో పనిచేసే కంపెనీలు ఈ ప్రాంతంలో కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2028 నాటికి ఈ ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
భారీగా పెరగనున్న ఉద్యోగ అవకాశాలు
ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనుంది. 2028 నుండి 2032 మధ్యకాలంలో ఈ డేటా సెంటర్ వల్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ప్రతి సంవత్సరం సుమారు రూ.10,518 కోట్ల వరకు ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా పెరగనున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 1.88 లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని అంచనా. ఈ ప్రాజెక్టుతో ఐటీ ఇంజనీరింగ్, డేటా సెంటర్ మేనేజ్మెంట్, సర్వర్ నిర్వహణ, సెక్యూరిటీ, టెక్నికల్ సపోర్ట్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్, సర్వీస్ రంగాల్లో ఉద్యోగాలు రానున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో భారీ మార్పులు
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు విశాఖ నగర రియల్ ఎస్టేట్ మార్కెట్పై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఐటీ కంపెనీలు, ఉద్యోగులు, సర్వీస్ రంగ సంస్థలు పెద్ద సంఖ్యలో రావడం వల్ల నగర పరిసర ప్రాంతాల్లో గృహ అవసరం పెరుగుతుంది. దీంతో కొత్త ఆఫీస్ పార్కులు అభివృద్ధి, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లకు డిమాండ్ పెరగనుంది, షాపింగ్ మాల్స్, కమర్షియల్ స్పేస్ల అభివృద్ధి చెందనుంది. మొత్తంగా హైదరాబాద్లో హైటెక్ సిటీ తరహాలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుంది.

