జగన్ దెబ్బ: కమలం గూటికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు?
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వైసీపీ నాయకత్వం కీలకమైన సూచన చేసిందనే ప్రచారం సాగుతోంది.
మాజీ మంత్రి, వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. వైసీపీలో పరిస్థితులు అనుకూలంగా లేనందున ఆయన కమలం గూటికి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.
అయితే ఈ విషయమై ఇంకా దగ్గుబాటి వెంకటేశ్వరరావు నుండి స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ నాయకత్వం కూడ పురందేశ్వరీ విషయమై దగ్గుబాటి కుటుంబానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కొడుకు హితేష్ తో కలిసి వైసీపీలో చేరారు. హితేష్ కు అమెరికా పౌరసత్వం రద్దుకాకపోవడంతో హితేష్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యాడు.
వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేరే ముందే తన సతీమణి పురంధేశ్వరీ బీజేపీలోనే ఉంటుందని కూడ వైసీపీ నాయకత్వానికి కూడ స్పష్టమైన సమాచారం ఇచ్చినట్టుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనుచరులు చెబుతున్నారు. ఆ సమయంలో వైసీపీ చీఫ్ జగన్ కూడ ఈ విషయమై తమకు ఇబ్బందులు లేవని చెప్పినట్టుగా సమాచారం.
ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకొంటున్నాయి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరడంతో వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న రావి రామనాథం బాబు ఎన్నికల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకొన్నారు. వారం రోజుల క్రితం జగన్ సమక్షంలో రావి రామనాథం బాబు టీడీపీని వీడి వైసీపీలో చేరారు.
రామనాథం బాబును వైసీపీలో చేర్చుకోవడంతో పాటు పర్చూరు నియోజకవర్గం అసెంబ్లీ ఇంచార్జీ బాధ్యతలు అప్పగించడం దగ్గుబాటి వర్గీయుల్లో అసంతృప్తిని నింపింది. ఈ విషయమై సీఎం జగన్ ను దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలిసి తన అసంతృప్తిని వెళ్లగక్కినట్టుగా ప్రచారం సాగుతోంది.
అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నాయకత్వం దూకుడుగా విమర్శలు చేస్తోంది. టీడీపీ, వైసీపీలపై విమర్శలు చేస్తోంది. మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరీ సీఎం జగన్ తో పాటు వైసీపీపై విమర్శలు చేస్తోంది.
ఈ పరిణామాలు వైసీపీ నాయకత్వానికి ఆగ్రహం తెప్పించినట్టుగా ప్రచారం సాగుతోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో ఇదే విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావించినట్టుగా చెబుతున్నారు.
పురంధేశ్వరీని కూడ వైసీపీలో చేర్పించాలని జగన్ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సూచించినట్టుగా ప్రచారం సాగుతోంది.అయితే అమెరికా పర్యటనలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయమై స్పష్టత ఇవ్వనున్నట్టుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్ కు చెప్పారని ప్రచారం సాగుతోంది.
వైసీపీ తీరుపై, సీఎం జగన్ పై బీజేపీ నేత పురంధేశ్వరీ విమర్శలు చేయడంపై వెంకటేశ్వరరావు మౌనంగా ఉండడం వైపీపీ నాయకత్వానికి ఆగ్రహం తెప్పించినట్టుగా వైసీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. దగ్గుబాటి కుటుంబానికి పార్టీ నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉన్నా కూడ ఆ పార్టీ నేతలు మాత్రం సానుకూలంగా వ్యవహరించకపోవడాన్ని వైసీపీ నాయకత్వాన్ని అసంతృప్తికి గురి చేసినట్టుగా చెబుతున్నారు.
దీంతో పురంధేశ్వరినీ బీజేపీ నుండి వైసీపీలో చేర్పించాలని జగన్ కోరినట్టుగా ప్రచారం సాగుతోంది.అయితే ఈ విషయమై రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలు ఏర్పడడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడ బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది.అయితే ఈ విషయమై స్పష్టత లేదు. గతంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు బీజేపీలో పనిచేశారు.