నేరుగా రంగంలోకి అమిత్ షా: ఏపీలో ఇక చేరికల జోరు
ఏపీ రాష్ట్రంలో బలోపేతం కావడానికి బీజేపీ ప్లాన్ చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ ప్లాన్ ను అమలు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.
టీడీపీతో పాటు ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరికలపై ఫోకస్ పెట్టనున్నారు. నెలకు ఓ రోజు ఏపీ రాష్ట్రంలో అమిత్ షా పర్యటించేలా ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ను బీజేపీ మరింత దృష్టి పెట్టాలని బీజేపీ తలపెట్టింది. ప్రధానంగా టీడీపీ నేతలను తమ వైపుకు తిప్పుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. కొందరు టీడీపీ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని ఆ పార్టీ నాయకత్వం వద్ద సమాచారం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.
అయినా కూడ పెద్దగా చేరికలు లేకపోవడంపై బీజేపీ నాయకత్వం ఏపీ రాష్ట్ర బీజేపీ నేతలపై కొంత అసంతృప్తితో ఉన్నారని సమాచారం.ఈ తరుణంలోనే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి టీడీపీతో పాటు ఇతర పార్టీల నుండి వచ్చేవారిని చేర్చుకొనేలా ఆ పార్టీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది.
ప్రధానంగా టీడీపీ నాయకత్వంపై బీజేపీ గురిపెట్టింది. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. మరికొందరిని కూడ తమ పార్టీలో చేర్పించేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది. కానీ ఇంతవరకు చేరికలు లేకపోవడంతో జాతీయ నాయకులే ఇక నేరుగా రంగంలోకి దిగనున్నారు.
ప్రతి నెలలో ఒక్క రోజు పాటు అమిత్ షా ఏపీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా చేరికలపై ఫోకస్ పెట్టనున్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఏ రకమైన వ్యూహన్ని అనుసరించాలనే దానిపై కూడ అమిత్ షా కమల దళానికి దిశా నిర్దేశం చేయనున్నారు.
ఎవరెవరు తమ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారనే విషయమై బీజేపీ నేతలు ఇప్పటికే ఓ జాబితాను తయారు చేసుకొన్నారు.ఈ జాబితా ఆధారంగా అమిత్ షా, జేపీ నడ్డాలు కార్యాచరణను అమలు చేయనున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి టీడీపీతో పాటు ఇతర పార్టీల నుండి చేరికలను పూర్తి చేయాలని బీజేపీ నాయకత్వం వ్యూహన్ని సిద్దం చేసుకొంది. ఈ వ్యూహన్ని అమలు చేయడమే ఇక తరువాయి
ఏడాది క్రితం బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రభుత్వాలపై విమర్శలు చేయడంపైనే కన్నా లక్ష్మీనారాయణ ఎక్కువగా దృష్టి పెట్టారనే ప్రచారం ఉంది. కానీ, పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన తీసుకొన్న చర్యలు లేవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.