కృష్ణ అంత్యక్రియలు ఫామ్ హౌస్ లో ఎందుకు చేయలేదంటే...!అఫీషియల్ వివరణ
పాతతరం సినిమా పెద్దలు చనిపోతే.. దాదాపు అందరూ స్టూడియోల్లోనే అంత్యక్రియులు నిర్వహించారు. ఎవరు చెప్పినా వినకుండా మహేష్ బాబు మహాప్రస్థానంలో కానిచ్చేశాడు అంటూ నిప్పులుకక్కుతున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో హైదరాబాద్ మహాప్రస్థానంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే, అంత గొప్ప సూపర్ స్టార్ అంత్యక్రియలు సొంత ఫామ్ హౌస్ లో కాకుండా శ్మశానవాటికలో నిర్వహించడంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మరి కొందరు ఎవరు చెప్పినా వినకుండా మహేష్ బాబు అలా కానిచ్చేశాడు అంటూ నిప్పులుకక్కుతున్నారు.
హైదరాబాద్ లో స్టూడియోలు నిర్మించుకున్న ఈ పాతతరం సినిమా పెద్దలు చనిపోతే.. దాదాపు అందరూ స్టూడియోల్లోనే అంత్యక్రియులు నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్లో ఏఎన్నార్, రామానాయుడు స్టూడియోలో రామానాయుడు సమాధిని కట్టించి స్మృతిచిహ్నాలను కూడా ఏర్పాటు చేశారు. కృష్ణగారికి కూడా అదే తరహా గౌరవం ఇవ్వాలంటే పద్మాలయ స్టూడియోస్ లో అంత్యక్రియలు చేసుండాల్సింది అంటున్నారు.
దీనిపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు స్పందిస్తూ... దీనికి ఒక కారణం ఉందని చెప్పారు. కృష్ణగారి భార్య అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు కూడా చేయాలనే భావనతో మహాప్రస్థానంలో చేశామని తెలిపారు.
ఇక కృష్ణగారి జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మెమోరియల్ హాల్ లో ఆయన కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 చిత్రాల వివరాలు, ఫొటోలు, షీల్డ్ లను ఉంచనున్నట్టు సమాచారం.