కరోనాతో హాస్పటల్ లో చేరిన విజయ్ కాంత్
నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్కాంత్ చెన్నైలోని MIOT హాస్పటిల్ లో జాయిన్ అయినట్లు సమాచారం.
తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్కాంత్ చెన్నైలోని MIOT హాస్పటిల్ లో జాయిన్ అయినట్లు సమాచారం. ఈ 68 సంవత్సరాల నటుడుకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అందుకే హుటాహుటీన నిన్న రాత్రి హాస్పటిల్ కు తీసుకెళ్ళారని తెలుస్తోంది. ఇప్పటికే చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే టెస్ట్ చేయగా కరోనా బయిటపడిందని తమిళ మీడియా అంటోంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్ధనలు చేస్తున్నారు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు.
ఇక విజయ్ కాంత్ కరోనా సమయంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు. కరోనాతో చనిపోయిన వారి ఖననం కోసం భూదానం చేశారు. చెన్నైలో ఆ మధ్యన కరోనాతో ఓ న్యూరో సర్జన్ చనిపోయాడు. అతడికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు స్మశానానికి తీసుకెళ్లగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు అడ్డుతగిలారు. అంత్యక్రియలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. అక్కడ ఆయనను ఖననం చేస్తే కరోనా వైరస్ తమకు సోకే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైద్యుడి మృతదేహాన్ని తీసుకెళ్లిన అంబులెన్స్పైనా దాడిచేశారు.
ఈ విషయం తెలిసి చలించిపోయిన విజయ్కాంత్.. చెన్నెలో ఉన్న తన స్థలంలో కొంత భాగాన్ని దానం చేశారు. తనకు చెందిన ఆండాళ్ అళగర్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని కొంత భాగాన్ని దానం చేశారాయన. కరోనా వ్యాధితో చనిపోయినవారిని ఖననం చేయడానికి ఆ చోటుని వాడుకోమని విజయ్ కోరారు.