వెయ్యిమంది కావాలి..కానీ ధర్డ్ వేవ్ రిస్క్ : విజయ్ దేవరకొండ
కరోనా సెకండ్ వేవ్ తో సినిమాలు చాలా భాగం ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గటంతో మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. అయితే ధర్డ్ వేవ్ భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. అదే పరిస్దితి తమ లైగర్ సినిమాకు ఉందంటున్నారు విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ ఓ ఫైటర్ పాత్రలో నటిస్తున్న చిత్రం లైగర్. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకుడు. ఇందులో అనన్య పాండే హీరోయిన్. కానీ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో లైగర్ షూటింగ్ వాయిదా వేసారు. అయితే ఇప్పుడు పరిస్దితులు మారి...‘లైగర్’ సినిమా సెట్స్లోకి త్వరలోనే అడుగుపెట్టనున్నారు విజయ్ దేవరకొండ.
‘లైగర్’ సినిమా షూటింగ్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ –‘‘మా సినిమా చిత్రీకరణ 65 శాతం పూర్తయింది. తల్లి, కొడుకులకు సంబంధించిన సెంటిమెంట్ సీన్స్ను కూడా దాదాపు పూర్తి చేశాం. కానీ క్లైమ్యాక్స్ సన్నివేశాల షూటింగ్ కు దాదాపు వెయ్యిమంది సెట్స్లో ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అంతమందితో చిత్రీకరణ అంటే కొంత రిస్క్తో కూడుకున్న పని. ‘లైగర్’ లాంటి భారీ సినిమా చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద సవాల్ అనే చెప్పాలి. అలాగే కరోనా థర్డ్ వేవ్ అవకాశాలను కూడా ఆలోచించి షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
రమ్యకృష్ణ కీలక పాత్రధారిగా చేస్తన్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్గా కనిపిస్తారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ముంబయ్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గతంలో ఎన్నడూ కనిపించనంత విభిన్నంగా దర్శనమిస్తాడని హామీ ఇస్తున్నామని, ఎవరినీ నిరాశకు గురిచేయని రీతిలో సరికొత్తగా కనిపిస్తాడని దర్శక,నిర్మాతలు గతంలో చెప్పారు.