Akella Suryanarayana  : ప్రముఖ తెలుగు సినీ రచయిత ఆకెళ్ల సూర్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. 

ఆకెళ్ల సూర్యనారాయణ ఇకలేరు

తెలుగు సినీ , సాహిత్య రంగాల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత ఆకెళ్ల సూర్యనారాయణ ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గురువారం రాత్రి (సెప్టెంబర్ 19, 2025) తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలో శనివారం ఉదయం 10:30 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో జానకీ – రామయ్య దంపతులకు జన్మించిన ఆకెళ్ల సూర్యనారాయణ చిన్ననాటి నుంచే నాటకరంగం పట్ల ఆసక్తి చూపారు. 1960లో బాలరాముడి పాత్రతో నాటకరంగంలోకి ప్రవేశించారు. ప్రారంభంలో చందమామ, బాలమిత్ర వంటి పత్రికలకు కథలు పంపడం ప్రారంభించి, అనంతరం నవలలు, కథలు, నాటకాలు, టీవీ సీరియల్స్‌కు రచనలు అందించారు.

సినీ రంగంలో ఆకెళ్ల ప్రస్థానం

ఆయన సుమారు 200 కథలు, 20 నవలలు, 800 టీవీ ఎపిసోడ్స్ కు రచయితగా పని చేశారు. ‘కాకి ఎంగిలి’, ‘అల్లసాని పెద్దన’, ‘రాణి రుద్రమ’, ‘రాణాప్రతాప్’ వంటి చారిత్రక నాటకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆయన తొలి సినిమా మగమహారాజు కాగా, అనంతరం స్వాతిముత్యం, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆడదే ఆధారం, ఓ భార్య కథ, ఔనన్నా కాదన్నా, ఎంత బావుందో వంటి ఎన్నో చిత్రాలకు మాటలు, కథలు అందించారు. అయ్యయ్యో బ్రహ్మయ్య చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు.

రచయితల సంఘానికి ఆకెళ్ల సేవలు

తెలుగు రచయితల సంఘానికి సుమారు 15 ఏళ్ల పాటు ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఆయన రచనల్లో ఎక్కువగా మహిళల జీవిత కథనాలు, సామాజిక అంశాలు, చారిత్రక ఇతివృత్తాలు ఉండటం విశేషం. ఆకెళ్లకు లభించిన ముఖ్యమైన పురస్కారాల్లో సాహిత్య అకాడమీ అవార్డు (‘కాకి ఎంగిలి’ నాటకానికి), నంది అవార్డు – 13 సార్లు ఉత్తమ రచయితగా, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, యువ చక్రపాణి తదితర అవార్డులు ఉన్నాయి.

ఆకెళ్ల సూర్యనారాయణకు ఐదుగురు సంతానం – నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ, సాహిత్యవేత్తలు, రంగస్థల కళాకారులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన లేనితనం తెలుగు సాహిత్య, సినిమా రంగాలకు తీరని లోటు అని పలువురు సంతాపం తెలుపుతున్నారు.