మరో టాలీవుడ్ డైరెక్టర్ని బలితీసుకున్న కరోనా.. నంద్యాల రవి కన్నుమూత
కరోనాకి మరో సినీ దర్శకుడు కన్నుమూశారు. ఇటీవల వరుసగా సినీ ప్రముఖులను కరోనా మహమ్మారి బలితీసుకుంటుంది. అందులో భాగంగా తాజాగా ప్రముఖ రచయిత, దర్శకుడు నంద్యాల రవి(42)కన్నుమూశారు.
కరోనాకి మరో సినీ దర్శకుడు కన్నుమూశారు. ఇటీవల వరుసగా సినీ ప్రముఖులను కరోనా మహమ్మారి బలితీసుకుంటుంది. అందులో భాగంగా తాజాగా ప్రముఖ రచయిత, దర్శకుడు నంద్యాల రవి(42)కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన శుక్రవారం ఉదయం 9.30గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. నంద్యాల రవికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
`నేనూ సీతామహాలక్ష్మీ`, `పందెం`, `అసాధ్యుడు` వంటి చిత్రాలకు రచయితగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు నంద్యాల రవి. విజయ్ కుమార్ కొండా-రాజ్ తరుణ్ కాంబినేషన్లో వచ్చిన `ఒరేయ్ బుజ్జిగా`, `పవర్ ప్లే` చిత్రాలకు రవి రచయితగా పని చేశారు. `లక్ష్మీ రావే మా ఇంటికి` చిత్రంతో దర్శకుడిగా మారి తన టాలెంట్ని నిరూపించుకున్నారు. నాగశౌర్య, అవికా గోర్ జంటగా నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓ వైపు రచయితగా రాణిస్తూనే దర్శకుడిగా తన ప్రతిభని చాటుకుంటున్నారు. ఇప్పుడు ఆయన సప్తగిరి హీరోగా ఓ సినిమా రూపొందించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు.
రవి స్వస్థలం పాలకొల్లు సమీపంలోని సరిపల్లి (గణపవరం పక్కన) ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అతనికి పలువురు ఆర్ధిక సాయం అందించారు. ఇక కోలుకుని ఇంటికి వచ్చేస్తున్నాడనగా, కరోనా అతడ్ని బలి తీసుకోవడం బాధాకరం. రవి అకాల మరణం పట్ల ప్రముఖ నిర్మాతలు వల్లూరిపల్లి రమేష్ బాబు, కె.కె.రాధామోహన్, బెక్కెం వేణుగోపాల్.. ప్రముఖ దర్శకులు విజయ్ కుమార్ కొండా, ప్రముఖ నటులు సప్తగిరి, ధన్ రాజ్ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.