''సొంత'' పప్పులో కాలేసిన హీరోలు!
సొంత ప్రొడక్షన్ లో సొంతంగా హిట్ కొట్టాలని ప్లాన్ చేసిన మన టాలీవుడ్ హీరోలు.. హిట్టు కొట్టలేక ప్రొడ్యూసర్ గా ఎఫెక్ట్ చూపించలేక నష్టాల పాలవుతున్నారు.
సొంత ప్రొడక్షన్ లో సొంతంగా హిట్ కొట్టాలని ప్లాన్ చేసిన మన టాలీవుడ్ హీరోలు.. హిట్టు కొట్టలేక ప్రొడ్యూసర్ గా ఎఫెక్ట్ చూపించలేక నష్టాల పాలవుతున్నారు. ప్రొడక్షన్ లో డబ్బులు పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు.
హీరోల్లో ఎవరైనా నిర్మాతగా సక్సెస్ అయ్యారంటే.. అది నాగార్జున అనే చెప్పాలి.. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఇప్పటికీ రెగ్యులర్ గా సినిమాలు తీస్తూనే ఉన్నాడు.
చాలా సార్లు నిర్మాతగా మారి సినిమాలు తీయాలనుకున్న బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ తో నిర్మాతగా మారాడు. కానీ మొదటి సినిమాకే నిర్మాతగా చేతులు కాల్చుకున్నాడు.
హీరోగా కెరీర్ మొదలుపెట్టిన కళ్యాణ్ రామ్.. మూడో సినిమాకే నిర్మాతగా మారాడు. అతడు నిర్మించిన మొదటి సినిమా 'అతనొక్కడే' సక్సెస్ కావడంతో నిర్మాతగా వరుస సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. కానీ నిర్మాతగా కళ్యాణ్ రామ్ కి సక్సెస్ ల కంటే ఫ్లాప్ లే ఎక్కువ. ఆయన హీరోగా 16 సినిమాలు చేస్తే నిర్మాతగా.. 10 సినిమాలు చేశాడు. అందులో రెండు, మూడు చిత్రాలు మాత్రమే లాభాలు తీసుకొచ్చాయి.
హీరోగా సినిమాలు చేస్తోన్న సమయంలో 'డీ ఫర్ దోపిడీ' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు నాని. సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ నటించిన ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేశాడు నాని. కానీ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. ఆ తరువాత మళ్లీ ఇంతకాలానికి 'అ!' సినిమాను తన సొంత బ్యానర్ పై నిర్మించాడు. ఈ సినిమాకి ప్రశంసలు దక్కాయి కానీ పైసలు మాత్రం రాబట్టలేకపోయింది.
నితిన్ నిర్మాతగా ప్రయత్నించి ఘోరంగా దెబ్బ తిన్నాడు.. అఖిల్ ని సక్సెస్ ఫుల్ హీరోగా లాంచ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. 'అఖిల్' చిత్రంతో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
టాలీవుడ్ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ 'నోటా' సినిమా కోసం 'కింగ్ ఆఫ్ ది హిల్స్' అనే బ్యానర్ స్థాపించి గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ తో కలిసి నిర్మాతగా సినిమా తీశాడు. కానీ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఇదే బ్యానర్ పై తరుణ్ భాస్కర్ హీరోగా సినిమా చేస్తున్నాడు.
ఈవీవీ బ్యానర్ పై అల్లరి నరేష్ నిర్మాతగా మారి 'బందిపోటు' సినిమా తీశాడు. ఆ సినిమా దెబ్బకు మరో సినిమా జోలికి వెళ్లలేదు.
హీరోగా సక్సెస్ లేని సమయంలో తన పేరు మీద ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టి 'కో అంటే కోటి' సినిమా తీశాడు శర్వానంద్. ఈ సినిమాతో కోట్లు పోగొట్టుకున్న శర్వా ఆ తరువాత నిర్మాతగా మరో సినిమా చేయలేదు.
ఐరా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'ఛలో' సినిమాతో నిర్మాతగా మారిన నాగశౌర్య హిట్ అందుకున్నాడు. కానీ ఆ తరువాత 'నర్తనశాల' తో ఘోరమైన ఫ్లాప్ చవిచూడాల్సి వచ్చింది.
హీరోగా కెరీర్ మొదలుపెట్టిన సుధీర్ బాబు 'సుధీర్ బాబు ప్రొడక్షన్స్' పేరుతో బ్యానర్ మొదలుపెట్టి 'నన్ను దోచుకుందువటే' అనే సినిమా తీశాడు. ఈ సినిమాతో హీరోగా సక్సెస్ రాలేదు సరి కదా.. నిర్మాతగా నష్టాలు భరించాల్సి వచ్చింది.
మంచు ఫ్యామిలీకి సొంత బ్యానర్ ఉన్నా.. మంచు విష్ణు '24 ఫ్రేమ్స్' అనే బ్యానర్ స్థాపించి 'వస్తాడు నారాజు' సినిమా తీశాడు. ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తరువాత తమ్ముడు మంచు మనోజ్ తో 'కరెంట్ తీగ' తీయగా అది కూడా షాక్ కొట్టింది. నష్టాలు పట్టించుకోకుండా నిర్మాతగా సినిమాలు తీసిన మంచు విష్ణు ఇప్పుడు నిర్మాణానికి దూరంగా ఉంటున్నాడు.
మెగాహీరో వరుణ్ తేజ్ తన చెల్లెలు నీహారిక కోసం నిర్మాతగా మారాడు. నీహారిక నటిస్తోన్న 'సూర్యకాంతం' సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి!