Gautham Raju: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు(68) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్థ రాత్రి కన్నుమూశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు(68) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్థ రాత్రి కన్నుమూశారు. గౌతమ్ రాజు మరణ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. దీనితో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. కానీ మంగళవారం ఒక్కసారిగా ఆరోగ్యం విషమించింది. దీనితో గౌతమ్ రాజు రాత్రి 1.30 గంటలకు మరణించారు.
గౌతమ్ రాజు ఎడిటర్ గా దక్షణాది చిత్రాలతో పాటు హిందీ చిత్రాలకు కూడా పనిచేశారు. తెలుగులో అయితే స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలకు అయన ఎడిటింగ్ అందించారు. గౌతమ్ రాజు షార్ప్ ఎడిటింగ్ అనేక చిత్రాల విజయాలకు ఉపయోగపడింది.
చట్టానికి కళ్ళు లేవు చిత్రం నుంచి ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. దాదాపు 800 చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసి చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. గౌతమ్ రాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు అంటే దర్శకులు భరోసాతో ఉండేవారు. ఎన్టీఆర్ ఆది చిత్రానికి గౌతమ్ రాజు ఎడిటర్ గా నంది అవార్డు సొంతం చేసుకున్నారు.
ఇటీవల కాలంలో ఆయన పనిచేసిన సినిమాలు గమనిస్తే వాటిలో కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150, బలుపు, అదుర్స్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయ్.
గౌతమ్ రాజు మృతితో స్టార్ సెలెబ్రిటీలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. గౌతమ్ రాజు తెలుగు సినిమాకి చేసిన సేవలు ఎప్పటికి గుర్తుంటాయని అంటున్నారు.